యాప్నగరం

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. జనం తీవ్ర ఇబ్బందులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ దారుణంగా మారింది.

Samayam Telugu 23 May 2020, 6:55 pm
సైక్లోన్ అంఫన్ గాల్లోని తేమను లాగేసుకొని పోవడంతో.. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఏపీ, తెలంగాణల్లో సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాస్తంత చల్లగా ఉండే హైదరాబాద్‌లోనూ భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తించాయి. ఉష్ణోగ్రతలు 44-46 డిగ్రీల మధ్య నమోదైనప్పటికీ.. తీవ్రమైన ఉక్కపోత, భయంకరమైన వేడి, కరెంట్ కోతలతో జనం అల్లాడారు.
Samayam Telugu నమూనా చిత్రం


ఉదయం ఏడు గంటలకే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాచలంలో 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.

శనివారం ఉదయం 11 గంటలకే నెల్లూరు జిల్లా కసుమూరులో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కురిచేడులో 43 డిగ్రీలు, కర్నూలు జిల్లా యనకండ్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే.. ఎండల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ, విజయవాడ నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో వాహనాల్లో శానిటైజర్లు తీసుకెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.