యాప్నగరం

రాష్ట్రమంతా హుజూరాబాద్ తీర్పు ఇవ్వాలి.. ఈటల రాజేందర్ పిలుపు

ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రనా సీఎం కేసీఆర్ గొప్పోడు కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. తుక్కుగూడ బీజేపీ మీటింగ్‌లో కేసీఆర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 14 May 2022, 9:36 pm
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌‌లో ఇచ్చిన తీర్పును రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి.. బీజేపీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌‌‌లో టీఆర్ఎస్ గెలిచేందుకు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. 13 మంది మంత్రులు 6 నెలల పాటు పనిచేసినా.. హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
Samayam Telugu ఈటల రాజేందర్


ఎనిమిదేళ్లుగా కేసీఆర్ చెబుతున్న మాటలు విని గతంలో సీఎం కేసీఆర్‌పై ఉన్న గౌరవం ప్రజల్లో పోయిందని.. ఎక్కడ చూసినా అసహ్యించుకుంటున్నారని ఈటల అన్నారు. దేశంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని కేసీఆర్ చెబుతున్నారని.. కానీ అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రూ.75 వేల కోట్లు అప్పు ఉంటే.. అది నేడు 5 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్నారు.

ఇది చైతన్యం నింపుకున్న తెలంగాణ అని.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. గ్రామాలలో ఎలాంటి ఉపాధి పనులు లేవన్నారు. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయని.. తెలంగాణ బిడ్డలు పనిచేసే పరిస్థితి ఉందా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసి.. కేంద్రంపై నిందలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రనా కేసీఆర్ గొప్పోడు కాదని.. రాష్ట్రంలో అన్ని వర్గాలు కేసీఆర్‌ను ఓడించేందుకు చూస్తున్నాయని ఈటల అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.