యాప్నగరం

హుజూర్‌నగర్‌లో మళ్లీ వాన.. సీఎం కేసీఆర్ సభ జరిగేనా?

CM KCR సభకు మరోసారి వర్షం రూపంలో అడ్డంకి ఏర్పడుతుందా? హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం నేపథ్యంలో భారీ బహిరంగ సభను తలపెట్టారు.

Samayam Telugu 26 Oct 2019, 4:19 pm
హుజూర్‌నగర్ ఓటర్లు.. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి ఘన విజయం కట్టబెట్టిన నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అక్కడ భారీ బహిరంగ సభను తలపెట్టారు. ‘కృతజ్ఞత సభ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశం శనివారం (అక్టోబర్ 26) సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. అక్కడ భారీ వర్షం కురుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu trs


కుండపోత వాన కారణంగా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ తలపెట్టిన ఎన్నికల బహిరంగ సభ అర్ధంతరంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభకు వరుణుడు మరోసారి అడ్డంకిగా మారతాడా? అని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే.. వర్షం కురిసినా ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని నేతలు చెబుతున్నారు.

రోడ్డు మార్గాన బయలుదేరిన కేసీఆర్..
ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో సీఎం కేసీఆర్.. రోడ్డు మార్గానా హుజూర్‌నగర్ బయల్దేరి వెళ్లారు. అక్కడ ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని.. లంచ్ చేసిన అనంతరం ఆయన బహిరంగ సభ తలపెట్టిన వేదికకు రానున్నారు.

Must Read: సింగరేణిలో బోనస్‌ బొనాంజా.. రూ.లక్షతో కార్మికుల ఇంట పండగ

బహిరంగ సభకు వర్షం కారణంగా ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సైదిరెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ఇప్పటికే రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారని.. సభ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని తెలిపారు. హుజూర్‌నగర్‌ సభకు సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా బయలుదేరారు. సూర్యాపేట, కోదాడ మీదుగా హుజూర్‌నగర్‌ చేరుకున్నారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. గురువారం కౌంటింగ్‌ పూర్తయిన అనంతరం సైదిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.

Also Read: హుజూర్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థి సత్తా.. రైతు సమస్యలపై పోటీ; బీజేపీ, టీడీపీలకు షాక్

రోజు వ్యవధిలోనే సభ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్ 17న వర్షంతో రద్దయిన సభాస్థలంలోనే తిరిగి సభను నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి సుమారు లక్ష మందిని తరలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.