యాప్నగరం

కాంగ్రెస్ అడ్డాలో ఏకమైన నేతలు.. సర్కార్‌‌పై సమరానికి సై, వ్యూహాత్మకంగా రేవంత్ అడుగులు!

కేసీఆర్ సర్కార్ విధానాలపై పోరాటాలకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ కొత్త చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై కేసీఆర్ సర్కార్‌పై సమరమేనని తేల్చి చెప్పారు.

Samayam Telugu 19 Sep 2021, 11:25 pm
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలతో నూతనోత్సాహం నెలకొంది. కేసీఆర్ సర్కార్ విధానాలను ఎండగడుతూ జనంలోకి వెళ్తున్న రేవంత్.. విపక్ష పార్టీలను ఏకం చేయడంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రజాసమస్యలపై గళం విప్పే కమ్యూనిస్టులు, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం తదితర నేతలతో ఈ రోజు గాంధీభవన్‌లో అఖిల పక్షం సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు తమ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
congress


రాష్ట్రంలో రగులుతోన్న పోడుభూముల సమస్య, ధరణి పోర్టల్‌లో భూముల సమస్యలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఈ సమస్యల పరిష్కారమయ్యే వరకూ పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 11 డిమాండ్లతో కార్యాచరణకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. అందులో భాగంగా ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా, 27న భారత్ బంద్, 30న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించి వినతిపత్రాలు ఇవ్వడం, పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ వచ్చే నెల 5న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 19 రాజకీయ పక్షాలు కలిసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు నేతలు వెల్లడించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం, కోవిడ్ మృతులకు నష్టపరిహారం, పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ, సర్‌ చార్జీల ఎత్తివేత తదితర 11 డిమాండ్లతో కార్యాచరణ రూపొందించినట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ఇంటి పార్టీ, న్యూ డెమొక్రసీ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, పీడీఎస్‌యూ తదితర నేతలు సమావేశమయ్యారు. ఐక్య కార్యాచరణతో కేసీఆర్ సర్కార్‌పై సమర శంఖం పూరించారు. బీజేపీ మినహా దాదాపుగా అన్ని విపక్షాలు సమావేశానికి హాజరుకావడం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కూడా పోరాటం సాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

Also Read: టీఆర్‌ఎస్‌లో ‘మల్లా రెడ్డి’ ముసలం.. దూకుడు ఎక్కువైందట! కీలక నేత గుడ్‌ బై?
Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.