యాప్నగరం

అటు ఐటీ, ఇటు హోం.. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేంద్రం షాక్.. ఏం జరుగుతోంది?

Kukatpally MLA మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఇదే రోజు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. ఈ రెండూ ఒకే రోజు జరగడం యాదృచ్ఛికమా లేదా వ్యూహాత్మకమా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Samayam Telugu 20 Nov 2019, 11:15 pm
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి దఫాలు దఫాలుగా ఐటీ అధికారులు ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. వెంకటరావు నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. మాధవరం కృష్ణారావుకు ముగ్గురు బినామీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు.
Samayam Telugu టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రమేష్, కృష్ణారావు


ఈ ముగ్గురిలో ఒకరు ఒక ప్రముఖ పత్రికకు సంబంధించిన విలేకరి అని సమాచారం. మాధవరం కృష్ణారావు కుమారుడు వెంకట ప్రణీత్ డెవలపర్స్‌ అనే సంస్థ ఉంది. మాధవరం కృష్ణారావు కార్యాలయం ఇంటిపై ఐటీ దాడులు జరగడం.. అధికార పార్టీలో సంచనమైంది. ఈయన కంపెనీల్లో ‘పెద్దల’ పెట్టుబడులు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐటీ దాడుల్లో ఈ అంశాలు బయటపడితే మరింత మందికి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది.

వెంకట ప్రణీత్ డెవలపర్స్ ఎండీ, మరో ఐదుగురు డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

చెన్నమనేని పౌరసత్వం రద్దు..
టీఆర్ఎస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. వేమువాలవాడ నుంచి ఎమ్మెల్యే గెలిచిన చెన్నమనేని రమేష్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉందని.. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ విచారణ జరిపింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ.. కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయంపై.. హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. కేంద్రం నిర్ణయంపై హైకోర్టులో పోరాడుతానని చెన్నమనేని రమేష్ తెలిపారు.

టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఒకే రోజు.. అటు ఐటీ శాఖ, ఇటు హోం శాఖ దాడులు చేయడం తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Read Also: కేసీఆర్‌కు పవన్ రిక్వెస్ట్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.