చల్లటి కబురు.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే, వాళ్లకి మాత్రం టెన్షన్
రెండ్రోజులుగా చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Samayam Telugu 14 Apr 2021, 4:03 pm
ప్రధానాంశాలు:
- తెలంగాణకు చల్లటి కబురు
- రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు
- ఆందోళన చెందుతున్న అన్నదాతలు
కొద్దిరోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలను వరుణుడు కనికరిస్తున్నాడు. భానుడి విలయతాండవం నుంచి విముక్తి కల్పిస్తూ రెండ్రోజులుగా వాతావరణాన్ని పూర్తి మార్చేశాడు. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్లోనూ వాతావరణం పూర్తిగా చల్లబడింది. మంగళవారం పలుచోట్ల వర్షాలు కురవడంతో బుధవారం నగరవ్యాప్తంగా వాతావరణం చల్లగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అనేక జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. బుధవారం ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. గురు, శుక్ర, శనివారాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని చెప్పారు. అయితే వర్ష సూచనపై ప్రజలు సంతోషంగానే ఉన్నా.. అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికి అందివచ్చిన ధాన్యం, మిర్చి నీళ్లపాలై రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పిడుగు పాటు ఘటనలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల మూగజీవాలు సైతం చనిపోయాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికి అందివచ్చిన ధాన్యం, మిర్చి నీళ్లపాలై రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పిడుగు పాటు ఘటనలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల మూగజీవాలు సైతం చనిపోయాయి.