యాప్నగరం

MLC కవితను అరెస్ట్ చేస్తారా ?.. JD లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..

Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత ఇవాళ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ సమన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున తాను రాలేనని చెప్పారు. దీంతో ఈనెల 20న మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆమె ముందున్న మార్గాలంటే ? కవితను అరెస్టు చేస్తారా ? ఈ అంశాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 16 Mar 2023, 3:43 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు
  • కవితకు మరోసారి నోటీసులు
  • ఆమె అరెస్టు అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Delhi Liquor Case
ఎమ్మెల్సీ కవిత
Delhi Liquor Case: దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టంచిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తాను రాలేనని ఈడీ అధికారులకు సమాచారం పంపారు. తనకు జారీ చేసిన సమన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పిన కవిత... ఆ పిటిషన్ ఈనెల 24కు విచారణకు రానుందని వెల్లడించింది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాను విచారణకు రాలేనని తన న్యాయవాది ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపించారు.
ఈ నేపథ్యంలో కవిత ముందున్న మార్గాలు.. ఆమె అరెస్టు తదితర విషయాలపై సీబీఐ మాజీ జేజీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈడీ ఇచ్చిన నోటీసులపై కవిత తన సమాధానాన్ని పంపించారని చెప్పారు. అయితే తన ఫోన్ లాక్కున్నారంటూ కవిత ఈడీపై చేసిన ఆరోపణలపై జేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారులు ఎదైనా కేసులో, ఎవరినైనా విచారించే క్రమంలో ముందుగా సమన్లు జారీ చేస్తారని చెప్పారు. విచారణకు హాజరయ్యే వారు తమ వెంటే ఏం తీసుకురావాలో (పత్రాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు) సమన్లలో ముందే పేర్కొంటారని వెల్లడించారు. విచారణ సమయంలో అవసరమైతే సమన్లలో పేర్కొ్న్న వస్తువులను సీజ్ చేసే అధికారం ఈడీ అధికారులకు ఉంటుందని జేడీ స్పష్టం చేశారు.

కానీ కవితకు జారీ చేసిన సమన్లలో ఫోన్ తీసుకురావాలని పేర్కొనలేదని అన్నారు. ఈ అంశంపై ఆమె న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇటువంటి క్రిమినల్ కేసులు న్యాయస్థానాల ద్వారా పరిష్కారం కావాలే తప్పు.. వ్యక్తిగత అభిప్రాయాలు చెల్లవని అన్నారు. అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయరని చెప్పారు. ఒకవేళ అరెస్టు చేస్తే.. అందుకు సంబంధించిన కారణాలను కోర్టు ముందు పొందుపరచవలసి ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఆధారాలు ధ్వసం చేశారని కవితపై అభియోగాలు ఉన్నాయని.. ధ్వంసం చేసిన ఫోన్లలో తమకు అవసరమైన సమాచారం ఉందని ఈడీ అధికారులు భావించే అవకాశం ఉందని చెప్పారు. అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే కవిత అరెస్టుపై ఈడీ అధికారుల నిర్ణయం ఉంటుందని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు అతడిని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అనుమానితురాలని ఈడీ కోర్టుకు తెలిపింది. పిళ్లైను, కవితను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పింది. దీంతో కోర్టు పిళ్లై కస్టడీని ఈనెల 20 వరకు పొడగించింది.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.