యాప్నగరం

దాడి చేశారు.. లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ సంజయ్ ఫిర్యాదు.. ఎన్‌హెచ్‌ఆర్సీలోనూ..

RTC Strike Row | తనపై దాడి జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్‌హెచ్ఆర్సీలోనూ ఆయన ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 7 Nov 2019, 5:32 pm
ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర సందర్భంగా.. పోలీసులు తనపై దాడి చేశారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. గురువారం ఢిల్లీలో స్పీకర్‌ను కలిసిన ఎంపీ.. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌పై ప్రివిలేజ్‌ నోటీసు అందజేశారు.
Samayam Telugu karimnagar mp bandi sanjay complaints to lok sabha speaker over police attacked him
దాడి చేశారు.. లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ సంజయ్ ఫిర్యాదు.. ఎన్‌హెచ్‌ఆర్సీలోనూ..


బండి సంజయ్‌ ఫిర్యాదుపై స్పందించిన లోక్‌సభ స్పీకర్‌.. ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌ సుశీల్‌కుమార్‌ సింగ్‌ను ఆదేశించారు. విచారణ త్వరగా ముగించి రిపోర్ట్ సమర్పించాలని సూచించారు. దాడి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎంపీ సంజయ్‌కు స్పీకర్‌ హామీ ఇచ్చారు.

శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని, దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. బండి సంజయ్ ఎన్‌హెచ్ఆర్‌సీకి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా సీఎస్‌, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ సీపీ, దాడి ఘటనలోని పోలీస్ అధికారులను చేర్చింది.

అసలు ఏమైందంటే..

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. అక్టోబర్ 30న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో సకల జనుల సమరభేరి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన నగునూరి బాబు గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఆయన కరీంనగర్ 2 డిపోలో డ్రైవర్‌గా పని చేసేవారు. సమ్మె కారణంగా అప్పటికే చాలా మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు వదలడంతో.. ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకు అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబ సభ్యులు ప్రకటించారు. రెండు రోజులు గడిచినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నవంబర్ 1న జేఏసీ నేతల సూచనతో బాబు అంత్యక్రియలు ప్రారంభించారు.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. బాబు మృతదేహాన్ని కరీంనగర్ డిపో వద్దకు తరలించాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ నిర్ణయించారు. బాబు అంతిమయాత్రను కరీంనగర్ డిపో వరకు కొనసాగిస్తామని.. దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని పోలీసులకు బండి సంజయ్ సవాల్ విసిరారు.

కాగా అంతిమయాత్ర డిపో వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. ఎంపీ సంజయ్, బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారి తనపై చేయి చేసుకున్నారని ఎంపీ ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగానే హెచ్ఆర్సీకి, స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.