యాప్నగరం

Krishnam Raju Funeral: కృష్ణంరాజు అంత్యక్రియలు.. మనసు మార్చుకున్న కుటుంబ సభ్యులు!

Krishnam Raju Funeral: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఉదయం కృష్ణంరాజు తుదిశ్వాస విడవగా.. నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 12 Sep 2022, 8:20 am
Krishnam Raju Funeral: రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించగా.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. నేటి (సోమవారం) మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Samayam Telugu Krishnam Raju
Krishnam Raju


కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ విషయమై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదివారమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

కృష్ణంరాజు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహిస్తారని తొలుత వార్తలొచ్చాయి. అభిమానుల సందర్శనార్థం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్క రెడ్డి స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు కృష్ణంరాజు పార్థీవదేహం అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

కృష్ణంరాజు కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ నివాసం ఉండటం కోసం ఓ ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. కానీ అది పూర్తి కాక ముందే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ముందుగా అనుకున్నట్లు మహాప్రస్థానంలో కాకుండా ఇక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు కాగా.. ఒక కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఆమె రావాల్సి ఉండటంతో.. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణంరాజు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభాస్‌ను ఫోన్లో పరామర్శించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.