యాప్నగరం

జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న లోక్‌సత్తా నేత జేపీ

ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్స్ పడిన సమయంలో ఆగి ఉన్న కారును ఓ ఆటో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ సురక్షితంగా బయటపడ్డారు.

Samayam Telugu 1 Dec 2019, 3:20 pm
లోక్ సత్తా పార్టీ నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వాహనం ప్రమాదానికి గురైంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో జేపీ సురక్షితంగా బయటపడ్డారు. జయప్రకాశ్ నారాయణ ఒక ప్రయివేటు కార్యక్రమానికి వెళ్తుండగా జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద సిగ్నల్ పడటంతో ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగింది. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు, టైరు పేలిపోయింది. కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడగా, ఆటోలోని మహిళలకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Samayam Telugu jp.


ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డు మధ్యలో ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో జేపీతోపాటు వైబీఐ అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది.

ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ సిగ్నల్ పడిన విషయం గమనించకుండా వేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అసలు కారణాలు గురించి ఆరా తీస్తున్న పోలీసులు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.