యాప్నగరం

ఆ పిటిషన్ వెనక్కి.. గవర్నర్ తమిళిసైకి హైకోర్టు అనుమతి

Madras High Court: తమిళనాడులో డీఎంకే ఎంపీ కనిమొళి గెలుపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Samayam Telugu 14 Oct 2019, 11:04 pm
డీఎంకే ఎంపీ కనిమొళి గెలుపును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఊరట లభించింది. సదరు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు ఆమెకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు సోమవారం (అక్టోబర్ 14) తీర్పునిచ్చింది.
Samayam Telugu tamilisai


ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే నేత, కరుణానిధి కుమార్తె కనిమొళిపై బీజేపీ తరపున తమిళిసై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే.. ఎన్నికల ఆఫిడవిట్‌లో కనిమొళి సరైన వివరాలు పేర్కొనలేదని ఆరోపిస్తూ ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read: కేకే మధ్యవర్తిత్వం, బెట్టు వీడిన ఆర్టీసీ నేతలు.. పరిష్కారంపై ఆశలు

‘ఆమె (కనిమొళి) భర్త అరవిందన్‌ను ఓ ఎన్నారైగా పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అరవిందన్‌కు పాన్‌కార్డు కూడా లేదు. ఆమె కుమారుడు ఆదిత్యన్‌ కూడా విదేశీ పౌరుడే. అతడికి కూడా పాన్‌ కార్డు లేదని అఫిడవిట్‌లో కనిమొళి పేర్కొన్నారు’ అని తన పిటిషన్‌లో తమిళిసై పేర్కొన్నారు.

కనిమొళి తన ఎన్నికల ఆఫిడవిట్‌లో ఐదేళ్ల ఆదాయ వివరాలను కూడా పేర్కొనలేదని తమిళిసై ఆరోపించారు. సింగపూర్‌లో ఆమె భర్త అరవిందన్‌, ఆదిత్యన్‌‌కు సంబంధించి పన్ను వివరాలేవీ నమోదు చేయలేదని వెల్లడించారు. కనిమొళి తప్పుడు ఆఫిడవిట్‌ దాఖలు చేశారని తమిళిసై ఆరోపించారు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Must Read: సచివాలయం కూల్చివేత.. పిటిషనర్‌కు షాకిచ్చిన హైకోర్టు

అయితే.. తాను మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని గవర్నర్ తమిళిసై కొద్ది రోజుల కిందట నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో సదరు పిటిషన్‌‌ను వెనక్కి తీసుకొనేందుకు మద్రాస్ హైకోర్టు తమిళిసైకి అనుమతి ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.