యాప్నగరం

రైతు బీమా 5 లక్షల కోసం తండ్రినే చంపేశాడు.. వికారాబాద్‌లో దారుణం

రైతు బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి తన తండ్రినే హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 23 Nov 2020, 8:06 pm
రైతు బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కన్నతండ్రినే కిరాతకంగా చంపేశాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన చింతల రుస్తుం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రుస్తుంకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుమారులు శేఖర్ (25), సురేశ్ (20) పేరిట ఒక్కో ఎకరి రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగిలిన ఎకరా భూమిని తన పేరు మీదే ఉంచుకున్నాడు. తండ్రీ, ఇద్దరు కుమారులు రైతు బంధు, రైతు బీమా పథకాలకు లబ్ధిదారులుగా ఉన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Man killed by son in Vikarabad (Representational Image)


రుస్తుం పెద్ద కుమారుడు శేఖర్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దారుణ కుట్రకు పథక రచన చేశాడు. తన తండ్రి చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు వస్తాయని భావించాడు. ఈ క్రమంలో కన్నతండ్రినే కడతేర్చాలనుకున్నాడు.

ఆదివారం (నవంబర్ 22) మధ్యాహ్నం రుస్తుం కుటుంబసభ్యులందరూ పొలం వద్ద విందు చేసుకున్నారు. మద్యం సేవించారు. తాగిన మత్తులో రుస్తుం ఆ రాత్రి పొలం వద్దే నిద్రించాడు. ఇదే అదనుగా భావించిన శేఖర్ నిద్రిస్తున్న తండ్రి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కపట నాటకానికి తెరతీశాడు.

అంతవరకు సరాదాగా గడిపిన రుస్తుం తెల్లారేసరికి విగతజీవిగా మారడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. శేఖర్ ప్రవర్తనా తీరులో అనుమానం రావడంతో అతడిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో రుస్తుంను తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతడిని పట్టించారు. బాధితుడి చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: తండ్రి చనిపోతే ఉద్యోగం వస్తుంది.. కానీ, చంపితే..!

Must Read: కరోనా పాజిటివ్ వ్యక్తి చిన్న అబద్ధం.. రాష్ట్రమంతా లాక్‌డౌన్‌!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.