యాప్నగరం

నా తల్లి మరణానికి మీ రోడ్డే కారణం.. ఎన్‌హెచ్‌ఏఐపై యువకుడి ఫిర్యాదు

NHAI: తన తల్లి మరణానికి రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యమే కారణమంటూ ఓ యువకుడు కేసు నమోదు చేశాడు. వరంగల్ రూరల్ జిల్లా దామెరలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 9 Jan 2020, 8:38 pm
రోడ్డు ప్రమాదంలో తన తల్లి మృతి చెందడానికి కారణం నిర్మాణంలో నిర్లక్ష్యమేనంటూ ఓ యువకుడు కేసు పెట్టాడు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్వర్టు నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, సూచికలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించాడు. ఇదే తన తల్లి మృతికి కారణమైందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu Representational Image


ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ గ్రామానికి చెందిన దుంపల ఆదిరెడ్డి తన తల్లి సౌందర్య (55)తో కలిసి గత ఆదివారం బైక్‌పై హన్మకొండ నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. ఒగ్లాపూర్ సమీపంలో ఓ కల్వర్టు వద్ద వారు ప్రయాణిస్తు్న్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి అక్కడ ఇరుకుగా ఉండటంతో బైక్ కల్వర్టును ఢీకొని పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ప్రమాదంలో ఆదిరెడ్డి, సౌందర్య తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులిద్దరినీ వెంటనే చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సౌందర్య తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం (జనవరి 8) మరణించారు.

తన తల్లి మృతికి కారణమైన కల్వర్టు నిర్మాణంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని.. కనీస ప్రమాణాలు పాటించలేదని సౌందర్య కుమారుడు జైపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.