యాప్నగరం

ప్లాస్మా దానం.. కరోనా రోగులకు సంజీవిని లాంటిది: చిరంజీవి

Cyberabad Police: ప్లాస్మా దాతలను సత్కరించేందుకు శుక్రవారం వీసీ సజ్జనార్ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు.

Samayam Telugu 7 Aug 2020, 5:00 pm
కరోనా రోగుల కోసం ప్లాస్మా డొనేషన్ ఇవ్వడం అనేది ఒక యుద్ధమని, ప్లాస్మా చికిత్సతో రోగులు త్వరగా కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా దాతలను సత్కరించేందుకు శుక్రవారం వీసీ సజ్జనార్ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చిరంజీవి
megastar chiranjeevi asks coronavirus survivors to donate plasma for patients


ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనాకు మందు లేని పరిస్థితుల్లో అయోమయం ఉంది. ప్లాస్మా దానం చేయడం అనేది బాధితుల పాలిట సంజీవనిగా ఉంది. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం వారు బతికే అవకాశం ఉంది. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా సోకిన వ్యక్తి దాని నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ఒక్కరు ప్లాస్మా దానం చేస్తే దాని వల్ల 30 మందికి సాయం చేయవచ్చు.’’ అని చిరంజీవి అన్నారు.

ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టపోవడం అనేది ఉండబోదని.. ప్లాస్మా తగ్గినా 24 గంటల నుంచి 48 గంటల్లో తిరిగి తయారవుతుందని చిరంజీవి తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. అందరూ జాగ్రత్తగా ఉంటే 100 శాతం కరోనాను ఎదుర్కొవచ్చని చిరంజీవి చెప్పారు. కొన్నాళ్లు పోతే మందు వచ్చాక జలుబు, జ్వరం మాదిరిగా కరోనా మారిపోతుందని అన్నారు.

సైబరాబాద్ పోలీసులు మొదలు పెట్టిన రక్తదాన కార్యక్రమానికి చిరంజీవి ఎంతో సహాయపడ్డారని సజ్జనార్ చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. కరోనాను జయించిన 3 నెలల్లోపే ప్లాస్మాను డొనేట్ చేయాల్సి ఉంటుందని, ప్లాస్మా యోధులు ప్రాణ దాతలంటూ సజ్జనార్ కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.