యాప్నగరం

Telangana: తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజుల పాటు వానలు.. ఈ జిల్లాలకు వర్షసూచన

Telangana: రాష్ట్రానికి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. నేటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 18 Apr 2023, 8:04 am
Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం, రాత్రి వేళ్లల్లో వానలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత మరింత పెరగడంతో పగటి వేళల్లో ప్రజలు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొద్దిరోజులుగా సాధాకరణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల వరకు పెరిగాయి. దాదాపు కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Samayam Telugu rains
వర్షాలు


మధ్యాహ్నం వేళల్లో ఎండ వేడికి ఇబ్బందులు పడుతుండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తుండటంతో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీంతో ఎండ వేడితో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే రాష్ట్రంలో ఎండలతో పాటు రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి వెదర్ బులిటెన్‌ను విడుదల చేసింది.

మంగళవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులు 30 నుంచి 49 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.

అటు రాష్ట్రంలో సోమవారం రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్‌లో 2.6 మి.మీ, వికారాబాద్‌లో 2 మి.మీ, వికారాబాద్ జిల్లాలోని పరిగిలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్‌లో 41.4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. పటాన్‌చెర్వులో 21.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఎక్కవ ప్రదేశాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. కొన్ని ప్రదేశాల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 37.8, కనిష్ట ఉష్ణోగ్రత 24.2 నమోదైంది. నగరంలో రాత్రి పలుచోట్ల వర్షాలు కురవగా.. నేడు కూడా పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.