యాప్నగరం

Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. రాబోయే ఐదు రోజుల పాటు తీవ్ర ఎండలు

Telangana: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా.. రాబోయే ఐదు రోజుల్లో తీవ్రత ఇలాగే కొనసాగనుంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వాతావరణశాఖ చెబుతోంది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తోంది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 17 May 2023, 7:27 am

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు
  • ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
  • రాబోయే ఐదు రోజులు పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu heat
ఎండలు
Telangana: తెలంగాణలో ఇప్పటికే భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ ప్రతాపానికి ప్రజలు సతమతమవుతున్నారు. ఎండ ప్రభావంతో పాటు తీవ్ర వడగాల్పులు, ఉదయం నుంచి ఉక్కబోత వస్తుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతతో రోడ్లపైకి జనాలు రావడం తగ్గిపోయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. దీంతో మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జనగాం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

18వ తేదీ నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 19వ తేదీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. 20వ తేదీ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు, 21వ తేదీ సూర్యాపేట, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కొమరం భీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంటే ఆరెంజ్ అలర్ట్.. 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తే.. రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. మంగళవారం నల్లగొండలో అత్యధిక ఉష్ణోగ్రత 43.5 డిగ్రీలు నమోదవ్వగా.. అత్యల్ప ఉష్ణోగ్రత పటాన్‌చెర్వులో 21 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో గరిష్టం 39.8, కనిష్టం 26.5, రామగుండంలో గరిష్టం 42.6, కనిష్టం 26.3, నల్లగొండలో గరిష్టం 43.5, కనిష్టం 25.0, నిజామాబాద్‌లో గరిష్టం 41.3, కనిష్టం 28.0 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో గరిష్టం 41.8, కనిష్టం 26.7, భద్రాచలంలో గరిష్టం 43.2, కనిష్టం 28.0 డిగ్రీలు, హనుమకొండలో గరిష్టం 41.9, కనిష్టం 27.0 డిగ్రీలు నమోదైంది.
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.