యాప్నగరం

‘నేనెవర్నీ బెదిరించ లేదు.. అవన్నీ తప్పుడు కథనాలు’

Minister Dayakar Rao | మెగా టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించి తన శిష్యుడి గురించి మాత్రమే వ్యాఖ్యానించాను తప్ప ఎవరినీ బెదిరించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం జరుగుతున్నందునే పరిశీలించానని తెలిపారు.

Samayam Telugu 1 Aug 2019, 5:12 pm
వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు భూసేకరణకు సంబంధించి తాను ఎవరినీ బెదిరించలేదని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం (ఆగస్టు 1) ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టెక్స్‌టైల్ పార్కు విషయంలో గతవారం తనపై మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తమని కొట్టిపారేశారు.
Samayam Telugu dayakar rao2


పార్క్ పనులు ఆలస్యంగా జరుగుతున్నందునే అక్కడికి వెళ్లి పరిశీలించానన్నారు. తన శిష్యుడు ఒకరి వల్ల పనుల్లో జాప్యం ఏర్పడిందనీ, కేవలం అతడిని ఉద్దేశించి మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. మరుసటి రోజే అతడు ఆ విషయాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పనుల్ని పరిశీలించేందుకు గత వారం మంత్రి దయాకర్ రావు వెళ్లారు. పనుల్లో ఆలస్యం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే పార్కు భూసేకరణకు సంబంధించి కోర్టుకు వెళ్లినవారిని మంత్రి బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. భూములు ఇవ్వకుంటే ముప్పుతిప్పలు పెడతానని దయాకర్ రావు వ్యాఖ్యానించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అవన్నీ తప్పుడు కథనాలు అని మంత్రి స్పష్టం చేశారు.

స్త్రీ నిధి కరపత్రం ఆవిష్కరించిన మంత్రి..
ఆపదలో ఉన్న ప్రతి పేద మహిళను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం స్త్రీ నిధి కరపత్రాలు ఆవిష్కరించిన ఆయన మహిళల సంక్షేమం కోసమే మెప్మా, సెర్ప్ తదితర సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు.

స్త్రీ నిధి ద్వారా రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా వర్తిస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులపై భారం పడకుండా రుణ బకాయిలను బీమా సంస్థ చెల్లించేందుకు రుణ సురక్ష కార్యక్రమం కూడా ఉందని మంత్రి వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.