యాప్నగరం

ఓ వైపు కరోనా ఉంటే బీజేపీ ప్రభుత్వాలు పడగొడుతోంది: ఈటల

Telangana BJP: దేశానికి కంటైన్‌మెంట్‌ను పరిచయం చేసిందే తెలంగాణ ప్రభుత్వం అని ఈటల గుర్తు చేశారు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కరోనా వస్తే అప్రమత్తం చేసింది కూడా తామే అని అన్నారు.

Samayam Telugu 21 Jun 2020, 3:56 pm
కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ప్రస్తుత సమయం పరస్పర ఆరోపణలు చేసుకొనే సమయం కాదని అన్నారు. కరోనా విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఓసారి సరిచూసుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం మంత్రి ఈటల మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం తెలంగాణ బీజేపీ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను మంత్రి ఈటల తప్పుబట్టారు.
Samayam Telugu ఈటల రాజేందర్
etela rajender


‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలు సరికావు. ఆయన జాతీయస్థాయి నాయకుడు అయి ఉండి ఓ గల్లీ లీడర్‌‌లా మాట్లాడారు. కరోనా అనేది ప్రపంచ సమస్య. గుజరాత్‌లో కరోనా తీవ్రతపై ప్రధాని బాధ్యత వహిస్తారా? తెలంగాణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనాపై అన్ని రాష్ట్రాల కన్నా ముందే తెలంగాణ అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం చర్యలపై కేంద్ర బృందాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి’’ అని ఈటల గుర్తు చేశారు.

దేశానికి కంటైన్‌మెంట్‌ను పరిచయం చేసిందే తెలంగాణ ప్రభుత్వం అని ఈటల గుర్తు చేశారు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కరోనా వస్తే అప్రమత్తం చేసింది కూడా తామే అని అన్నారు. దేశమంతా కరోనాపై పోరాడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ బిజీగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలను విమర్శించే ముందు కేంద్రం నిర్వహించిన బాధ్యత ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాపై కేంద్ర బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని.. జేపీ నడ్డా బాధ్యత లేకుండా మాట్లాడారన్నారని ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.