యాప్నగరం

Meerpet: కృష్ణన్నతో మాట్లాడుతా.. పెద్ద విషయమేం కాదు.. తీగల ఆరోపణలపై సబిత రియాక్షన్

మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్‌గా చేసుకొని తీగల కృష్ణారెడ్డి కబ్జా ఆరోపణలు గుప్పించగా.. మంత్రి దానికి స్పందించారు. కృష్ణన్నను ఎవరో తప్పుదోవ పట్టించారన్న ఆమె.. అదేం పెద్ద విషయం కాదులేండి.. మాట్లాడుకుంటామని మీడియాకు తెలిపారు.

Samayam Telugu 5 Jul 2022, 5:20 pm
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్‌గా చేసుకొని టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెరువులు, స్కూల్ స్థలాలను సైతం వదలడం లేదంటూ మంత్రిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీర్ పేట చెరువును పరిశీలించిన సందర్భంగా తీగల ఈ వ్యాఖ్యలు చేశారు. మీర్ పేటను నాశనం చేస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సబిత టీఆర్ఎస్ నుంచి గెలవలేదన్న తీగల.. మంత్రి తీరును సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Samayam Telugu Sabitha Indra Reddy-Teegala
Sabitha vs Teegala


ఎన్నికల్లో నేను ఓడిపోవచ్చు కానీ.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడి ప్రజలతోనే ఉంటాను. చెరువులో శిలాఫలకాలు వేస్తున్నారంటే అర్థం ఏంటి..? అని ప్రశ్నించారు. పార్టీ మారే ఉద్దేశంతోనే తీగల ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరగ్గా.. తాను పార్టీ మారబోనని.. టీఆర్ఎస్‌లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఉంటే టీఆర్ఎస్‌లో ఉంటాను.. లేదంటే రాజకీయాలను వదిలేస్తానన్నారు. తాను చిల్లర కార్పొరేటర్‌ను కాదన్నారు. నా కంటే గొప్పోళ్లు కాంగ్రెస్‌లో ఉన్నారా..? బీజేపీలో ఉన్నారా..? అని ప్రశ్నించారు.

తీగల కృష్ణారెడ్డి ఆరోపణల విషయమై మంత్రి సబిత స్పందించారు. ‘కబ్జాలు జరిగి ఉంటే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణన్న గారు ఇలా ఎందుకు మాట్లాడారో తెలీదు.. ఆయన్ను ఎవరు తప్పుదోవ పట్టించారో తెలీదు. తప్పకుండా వెరిఫై చేసుకుంటాం. మాట్లాడుకుంటాం లేండి అది పెద్ద విషయమేం కాదు’ అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రత్యర్థులు. 2009లో సబిత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తీగలను ఓడించారు. అప్పట్లో ఆయన టీడీపీలో ఉన్నారు. 2014లో తీగల.. మల్‌రెడ్డి రంగారెడ్డిపై గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబిత.. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీగలను ఓడించారు. అనంతరం ఆమె టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని పొందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.