యాప్నగరం

కరోనాతో వ్యక్తి మరణం.. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్న వేళ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Samayam Telugu 10 Aug 2020, 8:11 pm
కరోనా మృతదేహాల అంత్యక్రియలకు చాలా చోట్ల ప్రజలు అడ్డు తగలడం, కొన్ని చోట్ల కన్నబిడ్డలే తల్లిదండ్రుల మృతదేహాలను తీసుకెళ్లడానికి ముందుకు రాకపోవడం లాంటి ఘటనలు మనం చూస్తున్నవే. అనారోగ్యంతో చనిపోయినా.. కరోనా కారణంగానే మరణించారేమోననే అనుమానంతో అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు. మహబుబ్‌నగర్ పట్టణంలో కరోనాతో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన మంత్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Samayam Telugu మంత్రి శ్రీనివాస్‌గౌడ్


ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లదండ్రులు దురుదృష్టవశాత్తు కరోనా బారిన పడి అకాల మరణం చెందితే వారి పిల్లలు కనీసం మానవత్వం చూపకుండా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా హాస్పిటల్‌లోనే వదిలేయడం మానవత్వం లేని చర్యగా అభివర్ణించారు.

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్, వరంగల్‌లో జరిగిన సంఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి చలించిపోయిన శ్రీనివాస్ గౌడ్.. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, తన వంతు సామాజిక భాధ్యతగా పీపీఈ కిట్ ధరించి.. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కరోనాతో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలలో పాల్గొన్నారు.

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం అన్ని త్యాగాలు చేస్తే.. వారు చనిపోయాక దహన సంస్కారాలు చేయకుండా, కనీసం ఆసుపత్రికి వెళ్లి చూడకపోవడం.. మానవ మృగాలు చేసే పనిగా మంత్రి హెచ్చరించారు. ఇప్పటికైనా కరోనాతో చనిపోయిన వారి పట్ల ప్రజలు మానవత్వం చూపాలని.. పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అంతిమ సంస్కారాలు జరపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. పీపీఈ కిట్లు ధరించి 10 మందిలోపు అంతిమ సంస్కారాల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తతెత్తవని డాక్టర్లు సూచించారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.