యాప్నగరం

ఎంపీ బండి సంజయ్ భద్రత తిరస్కరణకు కారణమదే..

Karimnagar: గత నాలుగు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో కొందరు దుండగులు ఎంపీ బండి సంజయ్‌పై రాళ్ల దాడి చేశారని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంతో ఆయన ఆ సంఘటనను బహిర్గతపరచలేదన్నారు.

Samayam Telugu 22 Jan 2020, 5:03 pm
ఖాకీ దుస్తుల ముసుగులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొట్టె మురళీ కృష్ణ ఆరోపించారు. ఎన్నికల విధుల నుంచి కమిషనర్‌ను మార్చాలని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత నాలుగు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో కొందరు దుండగులు ఎంపీ బండి సంజయ్‌పై రాళ్ల దాడి చేశారని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంతో ఆయన ఆ సంఘటనను బహిర్గతపరచలేదన్నారు. నిఘా వర్గాల నివేదికలతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం గత రెండు రోజులుగా ఎంపీ బండి సంజయ్‌కి అదనపు భద్రత ఏర్పాటు చేశారని, కానీ ఈ సంఘటన నుంచి దృష్టి మళ్ళించేందుకు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి రాళ్ల దాడి జరగలేదంటూ రాజకీయ నాయకుడిలా పత్రికా ప్రకటన జారీ చేశారని విమర్శించారు.
Samayam Telugu Bandi Sanjay


పోలీస్ కమిషనర్ వైఖరికి నిరసనగా తనకు ఉన్న అదనపు భద్రత, వ్యక్తిగత భద్రతను ఎంపీ బండి సంజయ్ ఉపసంహరించుకొని తిరిగి పంపించారని మురళీకృష్ణ వివరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, గతేడాది పార్లమెంట్ ఎన్నికలు, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ సీపీ తీరు కేవలం బీజేపీ నాయకులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఉందని విమర్శించారు.

అంతా అవాస్తవం :సీపీ
మరోవైపు, రాళ్ల దాడి వ్యవహారంపై కరీంనగర్ సీపీ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఏ ప్రజా ప్రతినిధి పైనా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా రాళ్ల దాడులు, భౌతికమైన దాడులు జరగలేదని తెలిపారు. అలాంటి దాడి జరిగి ఉంటే, అదే రోజు సదరు ఎంపీ పోలీసుల దృష్టికి తెచ్చే వారని, అంతేకాకుండా వారి వ్యక్తిగత రక్షణ కోసం కేటాయించిన పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి ఉండేవారని అన్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా అవాస్తవమని కరీంనగర్ సీపీ ప్రకటనలో వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.