యాప్నగరం

జంపన్న వాగులో పర్యాటకులు.. ములుగు డీఎస్పీ సాహసం, 15 మంది సేఫ్

Mulugu DSP | జంపన్న వాగు ప్రవాహంలో చిక్కుకున్న భక్తులను ములుగు డీఎస్పీ సాహసోపేతంగా కాపాడారు. పోలీసులతో కలిసి 15 మందిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Samayam Telugu 8 Aug 2019, 12:24 am
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో వాగులు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ములుగు జిల్లా పస్రా - మేడారం ప్రాజెక్ట్ నగర్ వద్ద జంపన్న వాగు.. రహదారి పైనుంచి భయానకంగా ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహంలో బుధవారం (ఆగస్టు 7) 15 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ విజయసారథి తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. భక్తులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Samayam Telugu dsp
భక్తులను వాగు దాటిస్తున్న పోలీసులు


డీఎస్పీ సాహసోపేత చర్యపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసులు పర్యాటకులను భుజాలపై ఎత్తుకొని మోసుకొస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సహాయ చర్యల్లో పస్రా సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తమను కాపాడిన పోలీసులకు పర్యాటకులు ధన్యవాదాలు తెలిపారు. వీరంతా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి వచ్చారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

Read Also: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మూవీ టికెట్లు.. హైదరాబాద్ పోలీసుల గిఫ్ట్

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువగా ఉంది.

Read Also: ఏడు కార్లు ఢీ.. తమిళనాట ఘోర ప్రమాదం

వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే నాలుగైదు రోజుల్లో నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. మరోవైపు కుంటాల, బొగతా జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.