యాప్నగరం

CAA: చార్మినార్ వద్ద భగ్గుమన్న నిరసనలు.. తీవ్ర ఉద్రిక్తత

Citizenship Act: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద నిరసనలు పెల్లుబుకాయి. శుక్రవారం ప్రార్థనల నిమిత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముస్లింలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.

Samayam Telugu 20 Dec 2019, 3:10 pm
చార్మినార్‌ వద్ద నిరసనలు భగ్గుమన్నాయి. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో ప్రార్థనల కోసం భారీగా తరలి వచ్చిన ముస్లింలు.. ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Samayam Telugu Charminar


బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్న వేళ.. ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని గురువారం సాయంత్రమే ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు.

చార్మినార్ వద్ద అప్పటికే మోహరించి ఉన్న భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ దూసుకొచ్చారు. దీంతో మక్కా మసీదు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అటు దేశరాధి ఢిల్లీలోనూ నిరసనలు భగ్గుమన్నాయి. జామా మ‌సీదు ఆందోళ‌న‌కారుల‌తో కిక్కిరిసిపోయింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన చేప‌ట్టారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిర‌స‌న‌ ర్యాలీ వద్దకు రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Also Read: ఆదాయం కోసం రూటు మార్చిన కేసీఆర్..

చంద్రశేఖర్ ఆజాద్‌కు వాస్తవానికి పోలీసులు ముందుగానే అనుమ‌తి నిరాకరించారు. అయితే.. ఆయన రాజ్యాంగానికి చెందిన ఓ కాపీ చూపించి అక్కడకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆందోళ‌న‌కారులు ఆయ‌ణ్ని భారీ సంఖ్యలో చుట్టుముట్టారు. పోలీసులు ఆయణ్ని అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డ్రోన్ల ద్వారా ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆందోళ‌న‌లు నిర్వహించడం త‌మ‌ హ‌క్కని అన్నారు. కానీ, హింస‌ను ఖండిస్తున్నట్లు ఆయ‌న ప్రకటించారు. నిర‌స‌న‌ల్లో హింస‌కు దిగుతున్నవారు ఆ ఆందోళ‌న‌ల‌కు శ‌త్రువుల‌వుతార‌ని పేర్కొన్నారు. శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించాలి కానీ, ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. అలా చేసినప్పుడు ఫలితం ఉంటుంద‌ని చెప్పారు.

Also Read: అయ్యప్పలకు ముస్లిం యువకుడి అన్నదానం.. అక్కడే భిక్ష

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.