కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వద్ద జలకళ తగ్గుతోంది. నీటి ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు సోమవారం మూసివేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ అధికారులు అక్కడి నుంచి కిందికి నీటిని వదులుతున్నారు.
దీంతో ఎన్నడూ లేనంత స్థాయిలో పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చింది. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడంతో అనేక ప్రాంతాలు వారం రోజుల పాటు వరద నీటిలో చిక్కుకున్నాయి. సాగర్కు దిగువన అడవిదేవులపల్లి మండల శివారులో ఉన్న టెయిల్పాండ్ గేట్లను కూడా అధికారులు సోమవారం మూసివేశారు. సాగర్ నుంచి నీరు ఆగిపోవడంతో పులిచింతల గేట్లు కూడా సోమవారం సాయంత్రం మూతబడ్డాయి.