యాప్నగరం

1998 పేలుళ్ల కేసు: నాంపల్లి కోర్టు తుది తీర్పు.. నిర్దోషిగా కరీం తుండా

1998 Blasts Case: కోయంబత్తూరు వరుస పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. లష్కరే తోయిబా ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్డుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించింది.

Samayam Telugu 3 Mar 2020, 11:42 pm
1998 నాటి బాంబు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం మంగళవారం (మార్చి 3) తుది తీర్పు చెప్పింది. 1998 బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తమిళనాడులోని కోయంబత్తూరులో 1998 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు 12 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. 12 కి.మీ. పరిధిలో జరిగిన ఈ హింసాకాండలో మొత్తం 58 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ బాంబు పేలుళ్లకు సూత్రధారి కరీం తుండా అని ఆరోపణలు వచ్చాయి.
Samayam Telugu Karim Tunda


1998 పేలుళ్లలో తుండా పాత్ర ఉందన్నదానికి పోలీసులు సరైన ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు. దీంతో కరీం తుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డిఫెన్స్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు.. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న తుండా కేసులో కీలక తీర్పు వెలువరించింది. నిజానికి ఈ కేసులో తీర్పును ఫిబ్రవరి 18నే చెప్పాల్సి ఉండగా.. కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కాస్త ఆలస్యమైంది.

పాకిస్థాన్‌ నుంచి భారత్ అప్పగించాలని కోరుతున్న 20 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో కరీం తుండా ఒకడు. భారత్‌లో 40 పేలుళ్లలో అతడి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇండియా-నేపాల్ సరిహద్దులో 2013 ఆగస్టులో తుండాను అదుపులోకి తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఘజియాబాద్ జైల్లో ఉన్నాడు.

Also Read: ఫ్రెండ్ రిక్వెస్ట్‌, గూగుల్ పేతో 5 వేలు బదిలీ.. సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.