యాప్నగరం

అక్బరుద్దీన్‌ ఒవైసీ నిర్దోషి.. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసుల కొట్టివేత

ఎంఐఎం నేత, అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట కలిగింది. ఆయనపై ఉన్న రెండు విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులను కోర్టు కొట్టివేసింది. అయితే అలా మరోసారి మాట్లాడొద్దని హెచ్చరించడం గమనార్హం.

Samayam Telugu 13 Apr 2022, 3:12 pm
మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీకి దేశద్రోహం కేసులో ఊరట లభించింది. మతపరమైన విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు అక్బరుద్దీన్ ఒవైసీపై తొమ్మిదేళ్ల కిందట నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. కేసులను విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కోర్టు 30 మందికిపైగా సాక్షులను విచారించింది.
Samayam Telugu akbar


విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తుది తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పాతబస్తీ సహా నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. అక్బరుద్దీన్‌‌పై కేసులను కొట్టివేసి నిర్దోషిగా ప్రకటించిన కోర్టు ఆయనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో అలాంటి విద్వేషపూరితంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని వ్యాఖ్యానించింది. అటువంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొంది.

తొమ్మిదేళ్ల కిందట నిజామాబాద్, నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభల్లో అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మీరు వంద కోట్ల మంది ఉన్నారు. మేము కేవలం 25 కోట్ల మంది. అయినా సరే ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో సుమోటోగా కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసుల్లో అక్బరుద్దీన్ గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చారు. సుమారు 40 రోజులు జైల్లో గడిపిన అక్బరుద్దీన్ ఒవైసీ ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.