యాప్నగరం

ఎన్‌కౌంటర్ స్థలానికి NHRC సభ్యులు..

NHRC సభ్యులు శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే వారు ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడి ప్రదేశం మొత్తాన్ని కాలినడకన పరిశీలించడంతోపాటు, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అవనున్నట్లు తెలిసింది.

Samayam Telugu 7 Dec 2019, 3:49 pm
దిశ హత్యాచారం కేసులోని నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే వారు ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడి ప్రదేశం మొత్తాన్ని కాలినడకన పరిశీలించడంతోపాటు, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అవనున్నట్లు తెలిసింది. అంతేకాక, ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ఇద్దరు పోలీసులను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu nhrc2.



మరోవైపు.. హైదరాబాద్ నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ అధికారులు మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న నిందితుల మృతదేహాలను కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించనుంది. ఎన్‌కౌంటర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు.. ఏ సమయానికి నిందితులను అక్కడికి తీసుకొచ్చారు.. వంటి ఇతర వివరాలన్నింటినీ ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు సేకరించనున్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు విచారణ తర్వాతే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులు అప్రమత్తంగా లేరని ఎన్‌హెచ్‌ఆర్సీ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం నిజ నిర్ధారణ టీమ్‌ను నియమించింది.

Also Read: డిప్యూటీ స్పీకర్ ఇంట్లో దొంగతనానికి యత్నించి, చివరికి..
ప్రభుత్వాసుపత్రి వద్ద హై అలర్ట్
మరోవైపు, మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద హై అలర్ట్ నిర్వహించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుత్రికి తరలించిన నిందితుల మృత దేహాలకు గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్ట్ మార్టం చేయడంపై మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పరిధిలోకి వారు రావడమేంటని మహబూబ్‌నగర్ వైద్యులు పంచాయతీకి దిగారు. దీంతో ఇతర మృత దేహాలకు ఇవాళ జరగాల్సిన పోస్ట్ మార్టంను నిలిపేశారు. వైద్యులు విధులకు రాకపోవడంతో వేరే మృత దేహాలను జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు.

Also Read: దిశను చంపినప్పుడు మానవహక్కులు లేవా.. మండిపడుతున్న నెటిజన్లు

పోలీసుల ఎన్‌కౌంటర్‌పై కేసు..
దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదైంది. ఏసీపీ సురేందర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. దిశ హత్యకేసు విచారణాధికారిగా సురేందర్‌రావు వ్యవహరిస్తున్నారు. మరోవైపు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రాంతంలో క్లూస్‌టీం పర్యటించనుంది. కాల్పులు జరిపిన చోట బుల్లెట్ల కోసం సాంకేతిక పరికరాల ద్వారా తనిఖీలు నిర్వహించనుంది.

Also Read: ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగదు.. ఆ ఘటన పీడకలలా వెంటాడుతోంది: వరంగల్ యాసిడ్ బాధితురాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.