యాప్నగరం

హుజూర్‌నగర్‌లో ముగిసిన నామినేషన్ల గడువు.. మరో నిజామాబాద్ ఖాయమే!

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 100కుపైగా నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది.

Samayam Telugu 30 Sep 2019, 5:09 pm
హుజూర్‌నగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్లు సమర్పించడానికి గడువు ముగిసింది. చివరి రోజైన సోమవారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆఖరి రోజైన సోమవారం మంచి రోజు కూడా కావడంతో.. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ.. అప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థులు లైన్లో నిలబడటంతో.. వారందరికీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు.
Samayam Telugu huzurnagar-election


హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు 100కుపైగా నామినేషన్‌లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం నామినేషన్‌లను పరిశీలిస్తారు. అక్టోబరు 3 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబరు 21న పోలింగ్‌ జరగనుండగా, అక్టోబరు 24న కౌంటింగ్‌ జరుగుతుంది. భారీ సంఖ్యలో నామినేషన్లు రావడంతో.. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నిజామాబాద్ లోక్ సభ ఎన్నికను తలపించనుంది.

కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మావతి నామినేషన్ దాఖలు చేయగా.. టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ సమర్పించారు. బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, సీపీఎం నుంచి శేఖ‌ర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. భారీ సంఖ్యలో సర్పంచ్‌లు, లాయర్లు కూడా నామినేషన్లు వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.