యాప్నగరం

ఫేస్‌బుక్ నిషేధం ఎలా సాధ్యం..?: ట్విస్ట్ ఇచ్చిన రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్ బుక్ పేజీని నిషేధిస్తున్నట్లు ఆ సంస్థ చేసిన ప్రకటనపై రాజా సింగ్ స్పందించారు. 2019 ఏప్రిల్ నుంచి తాను ఫేస్‌బుక్ వాడటం లేదన్నారు.

Samayam Telugu 4 Sep 2020, 8:42 am
గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను నిషేధించినట్లు ఫేస్‌బుక్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ నడుచుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా తన ఫేస్ బుక్ ఖాతాల నిషేధంపై రాజాసింగ్ స్పందించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి తనకు ఫేస్‌బుక్ అకౌంటే లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒత్తిడితోనే ఫేస్‌బుక్ పని చేస్తోందా అని ప్రశ్నించారు.
Samayam Telugu Raja Singh
File photo of Raja Singh


2018లో తన అఫీషియల్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని సైబర్ క్రైమ్ విభాగానికి చేసిన ట్వీట్‌ను.. తన అకౌంట్ పేజీని అన్‌ పబ్లిష్ లేదా తొలగించారని 2019 ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌కు చేసిన ట్వీట్‌ను ఆయన మరోసారి ట్వీట్ చేశారు. 16 నెలలుగా ఫేస్ బుక్ వాడనప్పుడు బ్యాన్ చేశామని చెప్పడంలో అర్థం లేదన్నారు. బహుశా తన పేరిట అభిమానులు క్రియేట్ చేసిన ఫేస్ బుక్ పేజీని సోషల్ మీడియా సంస్థ నిషేధించి ఉంటుందని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. సమగ్ర పరిశోధన జరిపి కాంగ్రెస్, ఏంఐఎంఐఎం పార్టీలకు చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను తొలగించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. తన ఖాతాను ఓపెన్ చేయాలని ఫేస్‌బుక్‌కు లేఖ రాస్తానని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. ఫేస్ ‌బుక్ వాడే హక్కు తనకు ఉందన్న రాజాసింగ్.. నిబంధనల మేరకు ఆ సోషల్ మీడియా పేజీని వాడుతానన్నారు. ఫేస్‌బుక్ అనేది తటస్థ వేదిక అని, దానికి బీజేపీతో సంబంధం అంటగట్టడం సరికాదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.