యాప్నగరం

వంతెనపై నుంచి దూసుకెళ్లిన కారు.. సహాయక చర్యలకు వచ్చిన కానిస్టేబుల్ సైతం మృతి

కరీంనగర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 16 Feb 2020, 12:25 pm
కరీంనగర్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారి మానేరు వంతెన వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కింద పడిపోవడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని గండి శ్రీనివాస్‌ (40), గాయపడిన మహిళ ఆయన భార్యగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Samayam Telugu pjimage (43)


ఈ క్రమంలో బ్రిడ్జ్‌పై నుంచి కారును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నదిలో పడిపోయాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, ఆయనను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. అయితే, కానిస్టేబుల్‌ చంద్రశేఖర్ కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అతడిని కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో మృతుడు శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. బాధితులు కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ఘటనతో హైదరాబాద్‌-కరీంనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. క్షతగాత్రులను వైద్యం కోసం కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వంతెన వద్ద కారును అదుపుచేయలేక కిందపడినట్టు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.