యాప్నగరం

సంక్రాంతి గిఫ్ట్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 15నే ప్రారంభం

Secunderabad Visakhapatnam Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును ప్రారంభించనుంది. జనవరి 15న వర్చువల్‌గా జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. తొలుత ఈ రైలును జనవరి 19 ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించగా.. 4 రోజులు ముందుగానే అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య ఈ రైలు ఛార్జీ ఎంత? ఎన్ని స్టేజీలు ఉన్నాయి?

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 11 Jan 2023, 11:33 pm
సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు సంక్రాంతి రోజే ప్రారంభం కానుంది. తొలుత ఈనెల 19న ఈ రైలు ప్రారంభించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేయగా.. తాజాగా దీన్ని మార్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే 4 రోజుల ముందుగానే ఈ రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతికి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరిగొచ్చేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైల్లో ప్రయాణం చేసి సరికొత్త అనుభూతిని సొంతం చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu Secunderabad Visakhapatnam Vande Bharat Express
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు


జనవరి 15న ఉదయం 10 గంటలకు వర్చువల్‌గా జరిగే కార్యక్రమంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్‌ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌ రెడ్డి పాల్గొంటారు.

ముఖ్యాంశాలు:
★ దేశంలో ఇది 8వ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్.
★ ఇది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి 8.40 గంటల సమయంలో వైజాగ్ చేరుకోనుంది. ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం 4 నుంచి 6 గంటల వరకు తగ్గనుంది.
★ వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
★ ఈ రైల్లో రెండు రకాల కోచ్‌లు ఉంటాయి. 1) ఛైర్‌కార్‌ 2) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ కోచ్‌లో టికెట్ ఛార్జీలు ఇంచుమించు విమాన టికెట్ ధరలకు సమానంగా ఉన్నాయి.
★ ఈ రైలులో ప్రతి కోచ్‌ సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానం చేసి ఉంటాయి.
★ కోచ్‌ల ద్వారాలు ఆటోమేటిగ్గా తెరుచుకునే, మూసివేసే విధంగా ఉంటాయి. ఇవి కూడా లోకో పైలెట్‌ ఆధీనంలో ఉంటాయి. ప్రయాణికుల అత్యవసర సాయం కోసం ద్వారం వద్ద టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
★ వైఫై సదుపాయం, అద్దాలతో కూడిన విశాలమైన కిటికీలు, 360 డిగ్రీస్ తిరిగే సీట్లు ఈ రైలు ప్రత్యేకతలు.
★ విశాలమైన టాయిలెట్లు ఈ కోచ్‌‌ల మరో ప్రత్యేకత.
కోచ్‌లలో ప్రతి ప్రయాణికుడికి స్నాక్స్, టీ, కాఫీలు, పేపర్ అందిస్తారు.

ఛార్జీలు ఎంత?
సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడవనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు స్టేజీలను ప్రకటించినప్పటికీ.. ప్రయాణ ఛార్జీల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించాల్సి ఉంది. అయితే, దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీల ప్రకారం.. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1,700, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ధర రూ.3,100 ఉండవచ్చని అంచనా.

అయితే, ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ.. చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకొచ్చిన వందే భారత్ రైలుపై కంచరపాలెంలో ఆకతాయిలు రాళ్లు విసరడం అలజడి రేపుతోంది. ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.