యాప్నగరం

PM Modi | CM KCR : హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని.. బెంగళూరుకు వెళ్తున్న సీఎం కేసీఆర్!

PM Modi Hyderabad Tour: హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) ద్విదశాబ్ది వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 25 May 2022, 11:46 am
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) ద్విదశాబ్ది వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని పీఎంవో ప్రకటించింది. మరోవైపు సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా రేపు బెంగళూరు వెళ్లనున్నట్లు సీఎంవో ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రేపటి ప్రధాని పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పీఎంవో.. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా అందించినట్లు తెలిసింది.
Samayam Telugu KCR MODI


కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ముందు సీఎం కేసీఆర్‌కు ముఖం చెల్లకనే దేశవ్యాప్త పర్యటన అంటూ తిరుగుతున్నారని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు ముఖం చాటేశారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఇటు పీఎం రావడం, అటు సీఎం బెంగుళూరుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. . కేసీఆర్‌ బెంగళూరు పర్యటన దృష్ట్యా.. ప్రధానికి స్వాగతం పలకబోరని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్‌ ప్రకారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌.. స్వాగతం పలుకుతారని తెలుస్తోంది. అయితే ఇటు బీజేపీ నేతలు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

ప్రధాని హైదరాబాద్ టూర్ అధికారిక షెడ్యూల్ ఇదే..
గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ బేగం‌పేట్ ఎయిర్‌పోర్టు‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు విమానాశ్రయంలోనే బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం 1.50 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు మోదీ చేరుకుంటారు. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా 2 కి.మీ. ప్రయాణించి ఐఎస్‌బీకి వెళతారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోదీ చేరుకుంటారు. అనంతరం 4 .15 గంటలకు బేగం‌పేట్ నుంచి చెన్నైకి బయలుదేరుతారు.

ప్రధాని మోదీ పర్యటన కోసం పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్‌బీతోపాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలో బలగాలను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్‌బీలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు చేపడుతున్నారు. ఐఎస్‌బీ పరిసరాల్లో డ్రోన్లు ఎగరకుండా చర్యలు చేపట్టారు. ఇటు ఐఎస్‌బీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపై పోలీసులు దృష్టి సారించారు. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే.. వారికి గుట్టుగా హెచ్చరికలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రధాని చేతుల మీదుగా పట్టాలు అందుకునే 10 మంది విద్యార్థుల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ప్రధాని రాక సందర్భంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.