తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అప్పుడప్పుడు వాన పలకరిస్తూనే ఉంది. సోమవారం గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది. నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మరాఠ్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఆ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 21 వరకు ఒకటి రెండు చోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నది. ఒకటి రెండుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 21 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2, 3 డిగ్రీలు పెరుగవచ్చని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో 42.3 నుంచి 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ పేర్కొంది.
రెండు రోజుల పాటు తెలంగాణకు వర్షాలు
పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని తెలిపారు. ఆ ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి.
Samayam Telugu 20 Apr 2021, 7:39 am
ప్రధానాంశాలు:
- ఈనెల 21 వరకు వర్షాలు
- ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే ప్రమాదం
- సముద్ర మట్టానికి 1.5 కి.మీ. వరకు ఉపరితల ద్రోణి