యాప్నగరం

పండగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

కుటుంబ పెద్ద గతేడాది చనిపోవడంతో... తాజాగా సంవత్సరీకం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అంతా వచ్చారు. అందరూ ఒకే గదిలో పడుకున్నారు. ఇంతలో ఇంటి మిద్దె కూలింది.

Samayam Telugu 25 Oct 2020, 7:08 am
దసరా పండగ పూట విషాదం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాలో మిద్దె కూలి ఐదుగురు మృతిచెందారు. గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి సంవత్సరీకం కార్యక్రమం కోసం బంధువులంతా వచ్చారు. ఆయన కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు గ్రామానికి వచ్చారు. శనివారం కార్యక్రమం పూర్తయ్యాక రాత్రి ఒకే గదిలో 11 మంది కుటుంబ సభ్యులు పడుకున్నారు.
Samayam Telugu ఇల్లు కూలి ఐదుగురు మృతి


అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నానిన మట్టి మిద్దె కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి వారిపై పడింది. దీంతో గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకి మృతి చెందారు. మణెమ్మ కుమారుడు కుమారస్వామితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Read More: సీపీ సజ్జనార్‌కు అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు

శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తుల సహకారంతో వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. దసరా పండుగకు గ్రామస్తులు సిద్ధమవుతున్న గ్రామంలో ఇలా విషాదకరమైన ఘటన జరగడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.