యాప్నగరం

మనస్తాపంతో డ్రైవర్ మృతి.. ఆర్టీసీలో కొనసాగుతున్న విషాదాలు

RTC Strike: వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్య పరిష్కరించడం లేదనే దిగులుతో అనారోగ్యానికి గురై మరణించాడని కార్మికులు చెబుతున్నారు.

Samayam Telugu 22 Nov 2019, 2:21 pm
ర్టీసీలో కార్మికుల అకాల మరణాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదనే మనస్తాపంతో అనారోగ్యానికి గురై ఓ డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. అతడి మృతదేహంతో ఆందోళన చేస్తుండగా మరో కార్మికుడు సొమ్మసిల్లి పడిపోవడం విషాదం. వికారాబాద్ జిల్లా పరిగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం మండిపల్‌ గ్రామానికి చెందిన వీరభద్రయ్య (42) అనే కార్మికుడు పరిగి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో విధులు మానేసి ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నాడు.
Samayam Telugu death


సమ్మె ప్రారంభమై 40 రోజులకు పైగా అవుతున్నా.. కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని వీరభద్రయ్య దిగులు చెందాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై వారం రోజులుగా సరిగా ఆహారం తీసుకోలేదు. దీంతో అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబ సభ్యులు గురువారం (నవంబర్ 21) రాత్రి అతడిని వికారాబాద్‌లోని ఓ పైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరభద్రయ్య శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆర్టీసీ కార్మికులు, బంధువులు అతడి మృతదేహంతో పరిగి డిపో ఎదుట ఆందోళనకు దిగారు. బీజాపూర్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తుండగా.. శ్రీనివాన్‌ అనే మరో డ్రైవర్‌ స్పృహతప్పి పడిపోయాడు. అప్రమత్తమైన తోటి కార్మికులు అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.

Also Read: అశ్వత్థామ అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు.. కార్మికులను బలిపశువులను చేశారు

ఆర్టీసీ సమ్మె కాలంలో 30 మందికి పైగా కార్మికులు మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. 48 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, కోర్టుల్లోనూ చుక్కెదురవుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. షరతులు విధించకుంటే విధుల్లో చేరడానికి సిద్ధమంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డిపోల ముందు కార్మికులు బారులు తీరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.