యాప్నగరం

Ashwathama Reddy: మేం ఉడత లాంటి వాళ్లం.. కేసీఆర్ భయపెట్టారు

RTC Strike: సరూర్‌నగర్‌లో ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సకల జనుల సమరభేరిలో పలువురు ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు.

Samayam Telugu 30 Oct 2019, 7:49 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ తమను బెదిరించారని.. భయపెట్టారని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. సమ్మెతో తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. గమ్యాన్ని చేరే వరకు పోరాడిల్సిందేనని ఆర్టీసీ కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. వేతనాలు ఇవ్వకున్నా.. ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. బుధవారం (అక్టోబర్ 30) సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన ‘సకల జనుల సమరభేరి’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Samayam Telugu sakala


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కులమతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేశారని అశ్వత్థామ రెడ్డి గుర్తుచేశారు. నాటి ఉద్యమంలో తాము కూడా కీలక పాత్ర పోషించామని చెప్పారు. రామాయణంలో ఉడతలా ఉద్యమంలో కేసీఆర్‌కు దారి చూపించామని వ్యాఖ్యానించారు.

‘రామాయణంలో ఉడత రాముడికి దారి చూపించకుంటే రామాయణమే లేదు. మేం ఉడత లాంటి వాళ్లం. మమ్మల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భయపెట్టారు. జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదు’ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు.

ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేస్తే.. యూనియన్లను మూసేయాలనే కేసీఆర్‌ కోరిక కూడా నెరవేరుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తమకు కావాల్సింది ఆర్టీసీ పరిరక్షణ.. ప్రజా పరిరక్షణ అని రాజిరెడ్డి చెప్పారు.

సెల్ఫ్‌ డిస్మిస్ పేరుతో 48 వేల మంది కార్మికులను సీఎం కేసీఆర్‌ మనోవేదనకు గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె ఆంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చాడ వెంకట రెడ్డి కోరారు. నిజాం హయాంలో ప్రభుత్వం పరిధిలోనే ఆర్టీసీ సంస్థ నడిచిందని గుర్తు చేశారు. ప్రజలకు విద్య, వైద్యంతో పాటు రవాణా కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. ఆర్టీసీ 100 శాతం ఉండాలన్నారు. కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని.. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలతో తుగ్గక్‌ పాలన చేస్తున్నారని బీజేపీ నేత వివేక్‌ విమర్శించారు. కేసీఆర్‌ పెద్ద అవకాశవాది అని ఆరోపించారు. ఆర్టీసీపై ఆయన అబద్దాలు చెబుతున్నారన్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదంటే ప్రజలు నివ్వెర పోతున్నారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.