యాప్నగరం

ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె యథాతథం

RTC చర్చలు విఫలమయ్యాయి. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. హైకోర్టు ఆదేశాలపై కంటి తుడుపు చర్యగా చర్చలు జరిపారని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు.

Samayam Telugu 26 Oct 2019, 7:21 pm
ర్టీసీ జేఏసీ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశం నుంచి జేఏసీ నేతలు అర్ధంతరంగా బయటకొచ్చారు. యాజమాన్యం 21 డిమాండ్ల పైనే చర్చకు అంగీకరించిందని.. 26 డిమాండ్లపై చర్చ జరగాలని తాము పట్టుబట్టామని జేఏసీ నేతలు తెలిపారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. పూర్తి నిర్బంధ పద్ధతిలో చర్చలు జరిగాయని ఆరోపించారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మె యథావిథిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు.
Samayam Telugu MGBS


చర్చలు జరిగిన తీరుపై జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో కంటి తుడుపు చర్యగా చర్చలు జరిపారని పేర్కొన్నారు. కార్మిక సంఘాల తరఫున కేవలం నలుగురినే చర్చలకు అనుమతించారని తెలిపారు. తమ ఫోన్లను లాక్కొని స్విచ్ఛాఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్చలు ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని.. శత్రు దేశాలతో కూడా ఇలా వ్యవహరించరని విమర్శించారు.

Must Read: హైదరాబాద్‌లో RRR షూటింగ్.. ఈసారి శరవేగంగా, ప్రత్యేకంగా!

కోర్టు ఆదేశాలను మార్చి చెప్పారని జేఏసీ నేతలు ఆరోపించారు. చర్చల్లో పాల్గొన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఆర్టీసీపై సరైన అవగాహన లేదని విమర్శించారు. ఆర్టీసీ అంశంపై చర్చలు జరపుతూ ఆర్టీసీ అధికారులు పాల్గొనరా అని ప్రశ్నించారు. సమావేశాల నుంచి ముందు అధికారులే పక్కకు వెళ్లిపోయారని తెలిపారు.

సమ్మె ఆపే ప్రసక్తే లేదని అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. కోర్టు ఆదేశాలను వాళ్లకు అన్వయించుకునే పద్ధతిలో చర్చలు జరిపారని.. సమస్యను పరిష్కరించే ఉద్దేశం కనిపించలేదని ఆరోపించారు. అధికారులు పేర్కొన్న 21 అంశాలు ఏంటో కూడా తమకు చెప్పలేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

Don't Miss: హుజూర్‌నగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు.. కనీవిని ఎరుగని రీతిలో

హైదరాబాద్‌‌లోని ఎర్రమంజిల్‌లో ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో శనివారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం అధికారులు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఈడీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో పాటు మరో ముగ్గురు కో-కన్వీనర్లు భేటీకి హాజరయ్యారు. చర్చల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు పిలిస్తే మరోసారి చర్చలకు వస్తామని జేఏసీ నేతలు ప్రకటించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.