యాప్నగరం

ఖైరతాబాద్ గణపతి పూజలకు సిద్ధం.. కరోనా దెబ్బకు వ్యాపారుల అవస్థలు

Vinayaka Chavithi 2020: ధన్వంతరి అవతారంలో ఖైరతాబాద్ గణపతి దర్శనం ఇవ్వనున్నాడు. కేవలం 9 అడుగుల ఎత్తులో ఓ వైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Samayam Telugu 21 Aug 2020, 4:29 pm
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతికి ఎంతో విశిష్టత ఉంది. ఏటా ఇక్కడ ప్రతిష్ఠించే భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. చరిత్రలో తొలిసారిగా నిర్వహకులు చిన్న ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక చవితి పూజలకు అందుకునేందుకు గణనాథుడు సిద్ధం అయ్యాడు. 1970లో ఖైరతాబాద్‌లో 9 అడుగుల వినాయకుడ్ని ప్రతిష్ఠించారు. మళ్ళి 50 ఏళ్ళ తరువాత పరిస్థితుల కారణంగా 9 అడుగుల ఎత్తులో విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నారు.
Samayam Telugu ఖైరతాబాద్ గణపతి
Vinayaka Chavithi 2020


ఈసారి దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో ఖైరతాబాద్ గణపతి దర్శనం ఇవ్వనున్నాడు. కేవలం 9 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది. ఓ వైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా మట్టితో ఈసారి విగ్రహాన్ని తీర్చి దిద్దారు. ఈ ప్రతిమ అందరిని ఆకట్టుకుంటోంది. 66వ సారి నిర్వహకులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. అయితే గతానికి భిన్నంగా అక్కడే నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు కూడా అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు, కరోనా కారణంగా గణపతుల తయారీదారులు తీవ్రంగా నష్టపోయారు. చిన్న వినాయక విగ్రహాలను దిగుమతి చేసుకొని అమ్మేవారి పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. నగరంలో పలువురు వ్యాపారులను ప్రశ్నించగా.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. హిమాయత్ నగర్‌లో ఓ వ్యాపారి మాట్లాడుతూ.. 15 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నానని, కరోనా వల్ల వ్యాపారం మొత్తం దెబ్బతిన్నదని వాపోయారు. దుకాణాలు పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ తాము చిన్న చిన్న గణపతులను ఉంచి దుకాణం నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పర్యావరణ హిత ప్రతిమలను తయారు చేశాం. ఏటా పుణె, నాగ్‌పుర్ నుంచి వచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన బొమ్మలను తీసుకొచ్చి అమ్మేవాళ్లం. కానీ, ఈసారి అన్ని మట్టి విగ్రహాలే తెప్పించాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాల కంటే ఇప్పుడు మట్టి విగ్రహాల అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్ నేపథ్యంలో మాస్కు లేనివారికి విగ్రహాలు అమ్మడం లేదు.’’ అని కోఠిలోని వినాయక విగ్రహాల వ్యాపారి ఫణి వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.