యాప్నగరం

మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క.. అపురూప దృశ్యాలు

Medaram Jatara వన జాతరగా మారింది. సమ్మక్క రాకతో వనం పులకరించిపోయింది. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవలంతా గద్దెలపై కొలువుతీరడంతో భక్తులు పోటెత్తారు.

Samayam Telugu 7 Feb 2020, 7:05 pm
మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. సమ్మక్క తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ నేతృత్వంలో పోలీసులు చిలకలగుట్ట దిగువన గాల్లోకి కాల్పులు జరిపారు. సంప్రదాయ నృత్యాల మధ్య గురువారం (ఫిబ్రవరి 6) రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారు గద్దె వద్దకు చేరుకున్నారు. అంతే.. అమ్మ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న భక్తులు పూనకంతో ఊగిపోయారు. సమ్మక్క తల్లి నామస్మరణతో వనం దద్దరిల్లింది.
Samayam Telugu jatara


సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేరే సందర్భంగా భక్తులకు దర్శనాన్ని కాసేపు నిలిపి వేశారు. గిరిజన పూజారులు ప్రత్యేక పూజల అనంతరం అమ్మను గద్దెలపై ప్రతిష్టించారు. ఆ తర్వాత దర్శనాలను యథావిథిగా అనుమతించారు. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకరించిపోయింది. పలువురు భక్తులు ఆ అపురూప దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించుకున్నారు.
See Photo Story: వనదేవతలకు ప్రభుత్వ చీర - సారె.. మొక్కులు చెల్లించుకున్న సీఎం

గురువారం సాయంత్రం గిరిజన సంప్రదాయ పూజల అనంతరం చిలకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య సమ్మక్క తల్లి మేడారానికి బయలుదేరింది. సమ్మక్క తల్లి రాకతో వనదేవతలందరూ గద్దెలపై కొలువుదీరినట్లయింది. తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు మొక్కుగా చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో సంప్రదాయ స్నానాలు ఆచరిస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రాన్ని తలిపిస్తోంది.

Also Read: సమ్మక్క సారలమ్మ అసలు చరిత్ర ఇదే..

సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. శుక్రవారం, శనివారం వనదేవతలు గద్దెలపై ఉంటారు. శనివారం సాయంత్రం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా శుక్రవారం మధ్యాహ్నం అమ్మవార్లను దర్శించుకోనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వీవీఐపీ, వీఐపీ దర్శనాలు పెరగడంతో క్యూలో నిలబడి ఉన్న సాధారణ భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Must Read: యువత కోసం రామకృష్ణమఠం ప్రత్యేక ప్రోగ్రాం.. యాదాద్రిలో క్యాంప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.