యాప్నగరం

సెప్టెంబర్ 17 దేశవ్యాప్త ఉత్సవం.. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు: జయప్రకాశ్ నారాయణ్

National Integrity Day: సెప్టెంబర్ 17ను ‘జాతీయ సమగ్రతా దినోత్సవం’గా నిర్వహించుకోవాలని లోక్ సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు ఇచ్చారు. ఇది ఒక జాతిగా మనమందరం కలిసిన రోజని అన్నారు. హిందూ, ముస్లింల గురించి చర్చ కానే కాదని, దీనిపై లోతైన చర్చ జరగాలని అన్నారు. ప్రపంచంలో ఇంత అలవోకగా 565 సంస్థానాలను ఏకీకరణ చేసిన ఘట్టం ఎక్కడా లేదని చెప్పారు.ఒకే భాష, ఒకే మతం, ఒకే చరిత్ర ఉన్న ఇటలీ ఏకీకరణకు 20 ఏళ్లు పట్టిందని గుర్తుచేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 17 Sep 2022, 7:41 pm
సెప్టెంబర్ 17ను ‘జాతీయ సమగ్రతా దినోత్సవం’గా నిర్వహించుకోవాలని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఇది ఒక జాతిగా మనమందరం కలిసిన రోజని (National Integrity Day) గుర్తు చేశారు. హిందూ, ముస్లింల గురించి చర్చ కానే కాదని, దీనిపై లోతైన చర్చ జరగాలని అన్నారు. 20 ఏళ్ల కిందటి నుంచి తాను ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నానని చెప్పారు. ప్రపంచంలో ఇంత అలవోకగా 565 సంస్థానాలను ఏకీకరణ చేసిన ఘట్టం ఎక్కడా లేదని.. జాతిగా మనమందరం ఇది గర్వపడే విషయమని జేపీ అన్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే చరిత్ర ఉన్న ఇటలీ ఏకీకరణకు గారీ బాల్డీ సహా కీలక నేతలు 20 ఏళ్ల పాటు కృషి చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. జర్మనీ ఏకీకరణ కూడా అంత తేలిగ్గా జరిగింది కాదని తెలిపారు. భారత్‌లో మాత్రం శాంతియుతంగా వందలాది సంస్థానాల ఏకీకరణ జరిగిందని వివరించారు. గన్ ఫౌండ్రీలోని సూర్యలోక్ కాంప్లెక్స్‌లోని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆడిటోరియంలో లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి’ పేరుతో జాతీయ సమగ్రత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జయప్రకాశ్ నారాయణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
Samayam Telugu Lok Satta party chief jayaprakash narayan
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్


సెప్టెంబరు 17 దేశవ్యాప్త ఉత్సవమని, ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ కాలంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. కుల, మతాలకు అతీతంగా ప్రజల్లో అభద్రతా భావం చోటు చేసుకోకుండా రాజకీయ పార్టీలు పాటు పడాలని కోరారు. అధికార కేంద్రీకరణ ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఎన్నికల తీరు మారాలి. డబ్బులు, తాయిలాలు ఇచ్చి గెలిచే పరిస్థితులు పోవాలి’ అని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఈ సమావేశానికి లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. స్వేచ్ఛ, స్వపరిపాలన, సాధికారత, చట్టబద్ధ పాలన, స్వయం దిద్దుబాటు ప్రజాస్వామ్యానికి మూలాలని, వీటి కోసం లోక్ సత్తా పార్టీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ నర్సయ్య, సీహెచ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, రామచంద్రుడు, రంగాచారీ, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.