యాప్నగరం

హైదరాబాద్ మెట్రోరైల్‌లో పాము కలకలం

హైదరాబాద్ మెట్రోరైళ్లో పాము కలకలం రేపింది. పైలట్ క్యాబిన్‌లో దూరిన పామును ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు చాకచక్యంగా పట్టుకుని, అటవీ అధికారులకు అప్పగించారు.

Samayam Telugu 20 Aug 2019, 1:29 pm
హైదరాబాద్ మెట్రోరైలులో పాము కలకలం రేపింది. సుమారు 6 రోజులుగా మెట్రోరైలులోనే ప్రయాణించి చివరికి సోమవారం పట్టుబడింది. గత ఆగస్టు 14న డీబీ031 అనే నెంబర్ గల మెట్రోరైలు ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కి బయలు దేరింది. అయితే దిల్‌సుఖ్ నగర్ స్టేషన్‌కి రాగానే.. పైలట్ డ్యాష్ బోర్డులో ఓ పాము కనిపించింది. గమనించిన పైలట్ వెంటనే రైలును నిలిపివేసి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారమిచ్చాడు. కానీ, వారు అక్కడికి చేరుకునే లోపే పాము కనిపించకుండా పోయింది. దీంతో బయటకి వెళ్లిపోయి ఉంటుందని భావించారు. తిరిగి యథావిధిగా మెట్రోరైలును నడిపించారు.
Samayam Telugu metro.


అయితే, అప్పడు మాయమైన పాము సోమవారం (ఆగస్టు 19) మధ్యాహ్నం దిల్‌సుఖ్‌నగర్ స్టేషన్ సమీపంలోనే పైలట్ క్యాబిన్‌లో మళ్లీ దర్శనమిచ్చింది. ముందు జాగ్రత్తగా ప్రయాణికులను అక్కడే దించేసి, రైలును ఎల్బీనగర్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరోసారి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో వారు అక్కడికి చేరుకుని, ఈసారి పామును పట్టుకోగలిగారు. అయితే ఆ పాము విషపూరితమైంది కాదనీ, దాని వల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ జనరల్ సెక్రటరీ అవినాష్ విశ్వనాథన్ తెలిపారు. అనంతరం ఆ పామును అటవీ శాఖకు అప్పగించడంతో వారు సమీప అడవిలో వదిలేశారు.

మెట్రో రైలులో పాము ఘటనపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రోలో పాములు దూరే అవకాశాలు చాలా తక్కువ అనీ, ఈ విషయంపై ప్రయాణికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోజూ రైలు ప్రయాణించే ముందే సిబ్బంది పూర్తిగా పరీక్షిస్తారని తెలిపారు. మరోసారి ఈ ఘటన జరగకుండా జాగ్రత్త తీసుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.