యాప్నగరం

శ్రీశైలం ప్రమాదం: బ్యాటరీల మార్పిడిపైనే అనుమానం.. విచారణలో కీలక విషయాలు

Srisailam: అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఘటనపై శ్రీశైలం ప్లాంట్‌ ఇంచార్జ్‌ ఉమా మహేశ్వర‌ చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 28 Aug 2020, 4:09 pm
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు మరోసారి గురువారం శ్రీశైలం వెళ్లారు. ప్లాంటులో పని చేస్తున్న ఉద్యోగులను విచారణ జరిపారు. ఇప్పటికే ప్రమాద ఘటనపై సీఐడీ అధికారులు శాఖా పరమైన విచారణ పూర్తి చేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటికొచ్చిన ఉద్యోగులతో సంభాషించి పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన విషయాలు, ప్రమాద కారణాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో ప్రమాదం జరగడానికి గల కారణాలపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సమర్పించనుంది.
Samayam Telugu శ్రీశైలం అగ్ని ప్రమాదం
Srisailam fire


మరోవైపు, అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఘటనపై శ్రీశైలం ప్లాంట్‌ ఇంచార్జ్‌ ఉమా మహేశ్వర‌ చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం.. ఆగస్టు 20 వ తేదీ రాత్రి 10 గంటల 30 గంటల ప్రాంతంలో ప్రాజెక్టులో ఈ ప్రమాదం జరిగింది. హైడ్రో పవర్ టన్నెల్‌లో పని జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి యంత్రంలో ప్రమాదం సంభవించింది. ఏఈ, డీఈ, ఏఏఈలతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది చనిపోయారు. మరణించిన వారిలో ప్రాజెక్టులో బ్యాటరీలు అమర్చేందుకు వచ్చిన అమర్‌రాజా సంస్థకు చెందిన ఇద్దరు మెకానిక్‌లు కూడా ఉన్నారు.

టర్బైన్ వేగం పెరగడం వల్ల విద్యుదుత్పత్తి పెరిగిపోయిందని, దీంతో ప్యానెల్ యూనిట్స్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని తెలుస్తోంది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పవర్ హౌస్ జనరేటర్లు, కేబుల్ ప్యానెల్స్, బ్యాటరీలను మార్చేటప్పుడు న్యూకిలెన్స్ న్యూట్రల్‌గా మారకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో బ్యాటరీలు మార్చాలని రెండేళ్లుగా కోరుతున్నా పట్టించుకోలేదని ఇంజనీర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం మరణించిన ఇంజనీర్లకు సహచర ఉద్యోగులు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈలు బహిరంగంగానే ఉన్నతాధికారులపై విమర్శలు చేసినట్లు సమాచారం. దీనికి కారణం ఏమిటని కూడ సీఐడీ దర్యాప్తు చేయనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఎలాంటి ఉత్పత్తి లేని సమయంలో పవర్ ప్లాంట్‌లో మరమ్మతులు చేయాలి. మరి ప్రాజెక్టుకు వరదలు వచ్చి విద్యుత్ ఉత్పత్తి అవుతున్న సమయంలో బ్యాటరీలు ఎందుకు మార్చాల్సి వచ్చిందనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.