యాప్నగరం

వరవరరావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు.. ముంబై వీడొద్దంటూ షరతు

Bhima Koregaon Case: విరసం (విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే, కొన్ని షరతులు విధించింది. భీమా కోరెగావ్ కేసులో అభియోగాలపై పుణె పోలీసులు వరవరరావును అరెస్టు చేసి ముంబై తరలించారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 83 ఏళ్ల వరవరరావు కొంత కాలంగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండగానే ఆయన కొవిడ్ బారిన పడ్డారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 10 Aug 2022, 10:39 pm
వి, రచయిత, విరసం నేత వరవరరావుకు (Varavara Rao) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముంబై జైల్లో ఉన్న 83 ఏళ్ల వరవరరావు.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. జైల్లో ఉండగానే కరోనా వైరస్ బారిన పడ్డారు. కుటుంబసభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్నారు. బెయిల్ కోసం కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై సుదీర్ఘ వాద - ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కొన్ని షరతులు విధించింది. వరవరరావు ముంబై నగరాన్ని విడిచిపెట్టి వెళ్లరాదనేది షరతుల్లో ముఖ్యమైనది. వరవరరావుకు సాధారణ బెయిల్ రావడం కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ.. వయసు మీద పడి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ముంబైలో అద్దె ఇంట్లో ఉండాల్సి రావడం ఇబ్బందికర పరిణామమే. వరవరరావుకు బెయిల్ మంజూరు కావడం పట్ల ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu Varavara Rao gets Bail
వరవరరావు (అరెస్టు నాటి భావోద్వేగ దృశ్యాలు)


వరవరరావు వయసును, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం (ఆగస్టు 10) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ‘కేవలం వైద్య కారణాల ప్రాతిపదికనే బెయిల్ మంజూరు చేశాం. కానీ, ఈ కేసులో వరవరరావు తరఫున మొగ్గు ఉన్నట్లు కాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

కోర్టు విధించిన షరతులు:
  • స్పెషల్ ఎన్ఐఏ కోర్టు అనుమతి లేకుండా వరవరరావు గ్రేటర్ ముంబై దాటి వెళ్లరాదు.
  • బెయిల్ రూపంలో న్యాయస్థానం కల్పిస్తున్న ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు.
  • ఈ కేసులో ఇతర సాక్షులను కలవడానికి వీల్లేదు.
  • కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు.
  • వరవరరావు తనకు అవసరమైన వైద్య చికిత్స చేయించుకోవచ్చు. అయితే, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఎన్ఐఏ అధికారులకు తెలపాలి.

వరవరరావు బెయిల్ కోసం తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏమిటీ కేసు?
భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు 2018 జూన్‌లో కొందరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరించారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం. ఈ కేసులో రోనా విల్సన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. విల్సన్ వద్ద దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని, ఆ లేఖ ఆధారంగా వరవరరావును అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

మహారాష్ట్ర పోలీసులు వరవరరావును 2018 ఆగస్టు 28న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి పుణె తీసుకెళ్లారు. ఆయణ్ని అరెస్టు చేయడంపై హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాల సభ్యులు మండిపడ్డారు. ఇదంతా కుట్ర అని, ప్రశ్నించే గొంతును నొక్కడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (NIA) ఈ కేసును విచారిస్తోంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.