యాప్నగరం

బంద్ విజయవంతం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ కార్మికులు తమ నిరసనలో భాగంగా చేపట్టిన తెలంగాణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు సహకరించిన వారందరికీ ఆర్టీసీ జేఏసీ ధన్యవాదాలు చెప్పింది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.

Samayam Telugu 19 Oct 2019, 7:06 pm
స్వల్ప ఉద్రిక్త ఘటనలు మినహా తెలంగాణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ను విజయవంతం చేసినవారందరికీ ఆర్టీసీ జేఏసీ కృత‌జ్ఞతలు తెలిపింది. బంద్‌ను విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. శనివారం (అక్టోబర్ 19) సమావేశమైన కార్మిక సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అశ్వత్థామరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలన్నారు.
Samayam Telugu mgbs


ఆదివారం రాజకీయ పార్టీల నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలపనున్నారు. 23న ఓయూలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నారు.

Also Read: వీడియో: మలక్‌పేటలో కారు బీభత్సం.. ఎగిరిపడ్డ ట్రాఫిక్ ఎస్‌ఐ

ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఓయూ జేఏసీ అక్టోబర్ 23న ఉస్మానియా క్యాంపస్‌లో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభలో ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొననున్నారు. కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

బండ్లగూడలో తాత్కాలిక డ్రైవర్‌పై ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. డిపో నుంచి బస్సును తీయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో తాత్కాలిక డ్రైవర్‌పై దాడి జరిగింది. అతడు పారిపోతుండగా వెంబడించి దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటనతో సంబంధం ఉన్న మరో ఏడుగురి కోసం గాలిస్తున్నారు.

Also Read: సాగర్ కాలువలో నుంచి కారు వెలికితీత.. ఆరుగురు జల సమాధి

ప్రజలకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులకు సహకరించాల్సిందిగా కోరనున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఎంఐఎం పార్టీ మద్దతు కూడా కోరినట్లు వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పోలీసుల వాహనం ఎక్కించే క్రమంలో గాయపడ్డ పోటు రంగారావును జేఏసీ నేతలు పరామర్శించారు.

తెలంగాణ బంద్ ముగియడంతో సాయంత్రం 6 గంటల తర్వాత డిపోల నుంచి బస్సులు బయటకు వస్తున్నాయి. ఎంజీబీఎస్‌లో పలు ప్రాంతాలకు చేరుకునే ప్రయాణికులు పలువురు వేచి చూస్తున్నారు. బంద్ ముగియడంతో బస్సులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత బస్సులు వస్తాయని అధికారులు చెప్పినట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.