యాప్నగరం

జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. తొలి రైతు వేదికను ప్రారంభించనున్న సీఎం

5వేలమంది రైతులతో సభను నిర్వహించనున్నారు. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఓ క్లస్టర్‌గా విభజించి రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఒకే వేదికపైకి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

Samayam Telugu 31 Oct 2020, 7:35 am
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చేపట్టిన సర్కార్... ఇప్పుడు రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించనున్నా కేసీఆర్ అక్కడ నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జనగామ జిల్లా కొడకండ్ల గ్రామానికి చేరుకుంటారు. 12.10 గంటలకు కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు.
Samayam Telugu రైతు వేదికను ప్రారంభించనున్న కేసీఆర్
rythu vedika


12.20 గంటలకు పల్లె ప్రకృతివనాన్ని సీఎం పరిశీలిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠదామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలిస్తారు. అటు తరువాత కొడకండ్లలో 5000 మంది రైతులతో నిర్వహించనున్న సభలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు. రైతులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి... వారికి అన్ని సేవలు అందుబాటులో ఉండేవిధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రైతులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు బంధు సమితి సభ్యులు సమావేశమయ్యేలా ఈ రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తుంది.

Read More: హైదరాబాద్‌లో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి, ప్రతిక్లస్టర్‌కు ఒక రైతు వేదికలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో వేదికను 22 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్నారు. రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటి నిర్మాణాలు చేపడుతున్నారు. రైతులు సమావేశమయ్యేందుకు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఈ రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రాష్ట్రంలోని 2 వేల 604 క్లస్టర్లలో 573 కోట్ల వ్యయంతో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.