యాప్నగరం

సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ పరామర్శ.. పరిహారం విషయంలో సీఎం ముందుచూపు

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. రూ.5 కోట్ల చెక్, ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు.

Samayam Telugu 22 Jun 2020, 5:02 pm
సూర్యాపేట వెళ్లిన సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లిన సీఎం.. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో సూర్యాపేట చేరుకున్నారు. విద్యానగర్‌లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన సీఎం.. ముందుగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతోష్ బాబు మరణం కలచి వేసిందని.. మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
Samayam Telugu Image Courtesy: fb/telangana cmo
telangana cm kcr


కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు, హైదరాబాద్ కేబీఆర్ పార్కు సమీపంలో కేటాయించిన 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంతోష్ బాబు పిల్లల పేరిట రూ. 4 కోట్ల చెక్ అందజేసిన సీఎం.. ఆయన తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు. భవిష్యత్తులో డబ్బు విషయమై వారి మధ్య సమస్య రాకుండా కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరించారు. సంతోష్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా కేసీఆర్ అందజేశారు.

ఈ సందర్భంగా సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటానని సంతోషి ఉద్వేగానికి లోనయ్యారు. నచ్చిన శాఖలో ఉద్యోగంలో చేరామని చెప్పారన్నారు. కేసీఆర్ తనను ఇంటికి కూడా ఆహ్వానించారని సంతోషి తెలిపారు. సూర్యాపేటలోని కోర్టు ఏరియాలో ఉన్న చౌరస్తాలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దానికి సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామన్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.