యాప్నగరం

ఆసిఫాబాద్‌లో ముగిసిన డీజీపీ పర్యటన.. 5 రోజులు అక్కడే.. ఆంతర్యం అదేనా?

Asifabad: జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, ఇంచార్జీ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎఎస్పీ సుధీంద్రలతో పాటు ఇతర అధికారులతో విడివిడిగా డీజీపీ సమావేశమయ్యారు.

Samayam Telugu 6 Sep 2020, 7:39 pm
గత కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన ఆదివారం ముగిసింది. ఐదు రోజుల పాటు డీజీపీ పర్యటన సాగింది. ఓ డీజీపీ స్థాయి అధికారి మావోయిస్టు ప్రాబల్య మారుమూల ప్రాంతంలో పర్యటించడం చాలా అరుదు. అంతేకాక, ఈయన ఏకంగా రోజుల తరబడి అక్కడే ఉండి జిల్లా ఉన్నతాధికార యంత్రాంగంతో సమీక్షలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం మొత్తం డీజీపీ ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే పలు సమీక్షలు జరిపారు.
Samayam Telugu డీజీపీ మహేందర్ రెడ్డి
Telangana dgp


జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, ఇంచార్జీ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎఎస్పీ సుధీంద్రలతో పాటు ఇతర అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్రల నుంచి తెలంగాణలోకి వచ్చే మావోయిస్టులను కట్టడి చేయడంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో డీజీపీ మకాంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాల విస్తృత కూంబింగ్, అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Most Read: ఏడేళ్ల క్రితం దాచుకున్న వీర్యంతో ఇప్పుడు పండంటి బిడ్డ.. హైదరాబాద్‌లో అరుదైన ఘటన

2న పర్యటన మొదలు
సెప్టెంబరు 2న హెలికాప్టర్‌లో కుమురం భీం ఆసిఫాబాద్‌కు వచ్చిన డీజీపీ, అదే రోజు ఏజెన్సీలో విహంగ వీక్షణం నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతంలో ఉండే తిర్యానీ మండల పోలీసు స్టేషన్‌ను డీజీపీ రాత్రి పూట ఆకస్మిక తనిఖీ చేశారు. మిగతా రోజుల్లో ఆసిఫాబాద్ కేంద్రంలోనే ఉంటూ మావోయిస్టు సెర్చ్ ఆపరేషన్ల పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహించారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి మార్చిలో మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ నుంచి 11 మంది సభ్యులతో కూడిన మావోయిస్టుల బృందం వచ్చినట్లు సమాచారం. రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తున్న ఐదుగురు సభ్యులు మైలారపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ బృందాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు డీజీపీ రెండు రోజులుగా జిల్లాలోని ఉన్నతాధికారులతో కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.