యాప్నగరం

శుభవార్త.. రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్స ఉచితం!

Telangana Government: టీఏఈఐ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఆర్ అండ్ బీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, జాతీయ రహదారుల సంస్థల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై ఈ అంశంపై చర్చించారు.

Samayam Telugu 29 Jan 2020, 8:48 am
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడితే వారికి సర్కారు అండగా నిలవనుంది. ఇందులో భాగంగా క్షతగాత్రులైన వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తారు! గాయపడ్డ మొదటి మూడు రోజులు ఉచితంగా వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ‘తెలంగాణ స్టేట్‌ యాక్సిడెంట్‌, ఎమర్జెన్సీ కేర్‌ ఇనీషియేటివ్‌-టీఏఈఐ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఆర్ అండ్ బీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, జాతీయ రహదారుల సంస్థల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
Samayam Telugu road accidents


ప్రస్తుతం ఈ విధానం తమిళనాడులో అమలవుతోంది. దాదాపు ఇలాగే తెలంగాణలోనూ ఉచితంగా వైద్య సేవలందించాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గాయపడ్డ వారిని సమీపంలోని అన్ని రకాల ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్తే 3 రోజుల పాటు ఉచితంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పథకం అమలుకు సంబంధించిన నిధులను కొత్త వాహనాల రిజిష్ట్రేషన్‌ సమయంలోనే సెస్‌ లేదా ట్యాక్స్‌ విధించాలని ప్రతిపాదన వచ్చింది. అంటే, ప్రస్తుతం విద్య, స్వచ్ఛ భారత్‌ పన్ను తరహాలోనే రోడ్డు ప్రమాద బాధితుల ఉచిత చికిత్స కోసం కొత్త వాహనాలపై సెస్‌ విధించే అవకాశాలు ఉండొచ్చని ఓ సీనియర్ అధికారి విశ్వసనీయంగా వెల్లడించారు. అయితే, ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, ఇంకా ఖరారు కాలేదని అన్నారు.

మరోవైపు, ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలన్న ఆలోచన కూడా ఉందని ఆ అధికారి వెల్లడించారు. ప్రతి ఆస్పత్రిలో క్యాజువాలిటీ తరహాలో ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అధికారి తెలిపారు. ఈ పథకం కనుక అందుబాటులోకి వస్తే బాధితులకు ఎంతో మేలు కలిగినట్లవుతుంది. ప్రస్తుతం కొన్ని అరుదైన సందర్భాల్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి కాకుండా, దూరంగా ఉన్నా సరే ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తే ప్రమాదానికి కారణమైన వాహనదారుడు ఆ ఖర్చును భరించాల్సి వస్తుందనే ఆలోచనతో ఇలా చేస్తుంటారు. క్షతగాత్రుడికి తక్షణ చికిత్స అందాల్సిన ఇలాంటి సందర్భాల్లో వైద్యం జాప్యమైతే నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.