తెలంగాణలో కలకలం రేపిన ఖమ్మం జిల్లాలో సాయిగణేష్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల బలవన్మరణాల ఘటనలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ రెండు ఘటనలపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించారు. బీజేపీ నేతలు సమర్పించిన మీడియా, సోషల్మీడియా కథనాలు, వినతి పత్రాలపై గవర్నర్ గురువారం స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీటితో పాటు యాదాద్రి-భువనగిరి జిల్లాలో రామకృష్ణగౌడ్ పరువు హత్య, కోదాడలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్యకళాశాలలు పీజీ సీట్లను.. అర్హులైన నీట్ ర్యాంకర్లకు కేటాయించకుండా బ్లాక్ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న వ్యవహారంపై గవర్నర్ తమిళిసై తీవ్రంగా స్పందించారు. సీట్ల బ్లాక్ దందాపై ఆరోగ్య వర్సిటీ వీసీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా స్పందించిన గవర్నర్... రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందిన తెలంగాణ అభ్యర్థులు ఈ బ్లాక్ దందా కారణంగా మెడికల్ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిని ఆదేశించారు.
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై గవర్నర్ ఆగ్రహం... రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
తెలంగాణలోని ఖమ్మం, కామారెడ్డిలో జరిగిన ఆత్మహత్యలతో పాటు యాదాద్రి-భువనగిరి జిల్లాలో జరిగిన పరువు హత్య, కోదాడ గ్యాంగ్ రేప్, మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానాంశాలు:
- ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై గవర్నర్ తమిళిసై సీరియస్
- ఆ ఘటనపై నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశాలు
- మెడికల్ సీట్ల బ్లాక్ దందాపైనా ఆగ్రహం