యాప్నగరం

ఆర్టీసీ సమస్యలపై క్యాబినెట్‌లో 2 గంటలకుపైగా చర్చ.. కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీతోపాటు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలు కూడా క్యాబినెట్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంపైన కూడా చర్చించినట్లు తెలిసింది.

Samayam Telugu 2 Oct 2019, 11:53 am
అక్టోబరు 5 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించింది. మంగళవారం సుదీర్ఘంగా ఏడున్నర గంటల పాటు జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌లో ఆర్టీసీతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఆర్టీసీ సమస్యలపై రెండు గంటలకుపైగా తీవ్రంగా చర్చించిన మంత్రివర్గం.. వారి డిమాండ్లను పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించింది. ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం ఆగమేఘాలపై కమిటీని నియమించింది. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున సమ్మె నిర్ణయాన్ని విరమించుకుని సహకరించాలని ఉద్యోగులను క్యాబినెట్ కోరింది. సొంత సంస్థకే నష్టం కలిగించరాదని, కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని కార్మికులకు సూచించారు. ప్రజలంతా స్వస్థలానికి పండగలకు ప్రయాణమయ్యే వేళ సమ్మెకు దిగి, వారిని ఇబ్బందుల పాలు చేయవద్దని కోరింది.
Samayam Telugu kcr_2855


ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చారు. రోడ్డు రవాణా సంస్థ ప్రస్తుత పరిస్థితి, ఇతర అంశాలను క్యాబినెట్ సహచరులకు సీఎం వివరించారు. కార్మికుల డిమాండ్లకు పరిష్కారం చూపడంతోపాటు కమిటీ నివేదిక అందగానే ఇవ్వగానే సంస్థ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ సభ్యులుగా కమిటీని నియంచారు. ఈ కమిటీతో కార్మికులు తమ సమస్యలపై చర్చించాలని క్యాబినెట్ సూచించింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసింది.

అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితిగతులపై మంత్రివర్గ సమావేశం విస్తృతంగా చర్చించింది. ప్రాజెక్టులు నిండటంతోపాటు మంచి వర్షాలు పడిన నేపథ్యంలో రబీలోనూ సాగు విస్తీర్ణం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు ప్రభుత్వానికి తగు సూచనలు చేయడానికి శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈటల రాజేందర్‌ నేతృత్వంలో వైద్య, ఆరోగ్య కమిటీ, ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన గ్రామీణ పారిశుద్ధ్య కమిటీ, కేటీఆర్ అధ్యక్షతన పట్టణ పారిశుద్ధ్య కమిటీ, హరీశ్‌రావు సారథ్యంలో వనరుల సమీకరణ కమిటీ సహా సంబంధిత శాఖలకు చెందిన మంత్రులతో నేతృత్వంలో పచ్చదనం కమిటీ, వ్యవసాయ కమిటీ, పౌల్ట్రీ కమిటీ, సంక్షేమ కమిటీలను నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.